Pawan Kalyan Serious Allegations: రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే.. వైసీపీని తరిమికొట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమలాపురం బహిరంగ సభలో పిలుపునిచ్చారు. 'హలో ఏపీ.. బై బై వైసీపీ' అంటూ కొత్త నినాదం ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకొనసాగుతుంది. పవన్ కల్యాణ్ను చూడటానికి జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు పోటెత్తారు. జనసందోహం, పోటెత్తిన అభిమానుల మధ్య రోడ్ షో సాగింది. రోడ్ షో అనంతరం అమలాపురంలో గడియారం స్తంభం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ప్రతి ఒక్కరూ సంతోషిస్తారని... అయితే, అభిప్రాయ సేకరణ పేరుతో వైసీపీ నేతలే గొడవలు సృష్టించారని ఆరోపించారు. అనంతరం జరిగిన గొడవల్లో 250 మందిని జైలులో పెట్టారని పేర్కొన్న పవన్.. జైలులో పెట్టిన అమాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టేందుకు ఇంత గొడవ జరగాలా అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గొడవలను పెంచేవారు నాయకులు కాదన్న పవన్ కల్యాణ్ గొడవలను తగ్గించే వారే నిజమైన నాయకులని పేర్కొన్నారు.
గంజాయికి గేట్వేగా కాకినాడ: వైసీపీ ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహిస్తోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. గంజాయికి గేట్వేగా కాకినాడ మారిందని ఆరోపించాడు. వైసీపీ పాలనలో ఏపీలో నేరాలు పెరిగాయని పవన్ విమర్శించారు. ప్రభుత్వ అండతో దేశమంతా గంజాయి అమ్ముతున్నారన్న పవన్.. రాష్ట్రంలో గంజాయి విక్రయాలపై అమిత్షాకు చెప్పినట్లు పవన్. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని పవన్ విమర్శించారు. మద్యం అమ్మకాల ద్వారా రూ.25 వేల కోట్లు సంపాదిస్తున్నారని ఎద్దేవా చేశాడు. కల్తీ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచుల పసుపు కుంకుమలతో ఆటలాడుకుంటున్నారన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి.. సంపూర్ణంగా మద్యం అమ్ముతున్నారని పవన్ ఆరోపించారు.