గుంటూరు జిల్లా నరసరావుపేటలో మే 17 తరువాత దశలవారీగా లాక్డౌన్ తొలగింపు ఉంటుందని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. నరసారావుపేటలోని ప్రభుత్వ కార్యాలయంలో సబ్కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
నరసరావుపేటలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో గత 14 రోజులుగా పట్టణంలో పూర్తి లాక్ డౌన్ అమలు చేశామని అన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో 173 కేసులు నమోదు కాగా వాటిలో 88 మంది కోలుకోవడంతో ఇళ్లకు పంపించామని సబ్కలెక్టర్ చెప్పారు. ఇంకా 40 మందిని మే 17 నాటికి క్వారంటైన్ నుంచి ఇళ్లకు పంపిస్తామన్నారు. ఇదంతా 'మిషన్ మే 15'తో సాధ్యమైందని ఆయన వివరించారు. పట్టణ ప్రజలు సహకారంతో అధికారులు కరోనా కేసులను నియంత్రించామన్నారు.
మే 18వ తేదీ నుంచి కొన్ని రోజుల పాటు పట్టణంలో లాక్డౌన్ సడలింపును దశలవారీగా ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలో వార్డులను రెండు భాగాలుగా విభజించి ఒక భాగం వార్డు ప్రజలు ఒకరోజు ఉదయం 9 గంటలలోపు, రెండో భాగం వార్డు ప్రజలు మరుసటిరోజు బయటకు వచ్చేలా వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.