ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 21, 2020, 5:28 AM IST

Updated : Jan 21, 2020, 9:29 AM IST

ETV Bharat / state

అర్ధరాత్రి వరకు చంద్రబాబును డొంకరోడ్లలో తిప్పిన పోలీసులు

శాసనసభ నుంచి బయటకు వచ్చాక తెలుగుదేశం నేతలను..... పోలీసులు అరెస్ట్‌ చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య జడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న చంద్రబాబును డొంకరోడ్లలో తిప్పడం తెలుగుదేశం నాయకులను అసహనానికి గురిచేసింది. పోలీస్‌ చర్యలను ఖండిస్తూ నేతలు ఆందోళనకు దిగటంతో అర్ధరాత్రి దాటే వరకూ నిరసన కొనసాగింది.

Chandrababu was arrested by the police and released shortly
Chandrababu was arrested by the police and released shortly

నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు అరెస్టు.... విడుదల

వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వేళ.... రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతల మధ్య అరెస్టులు, నిర్బంధాల పర్వం సాగింది. పోలీసుల లాఠీఛార్జ్‌లో దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు శాసనసభ నుంచి బయల్దేరిన చంద్రబాబు సహా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద నిలువరించారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. చంద్రబాబు, ఎమ్మెల్యేలను బలవంతంగా అరెస్ట్‌ చేసి వ్యాన్‌లోకి ఎక్కించారు.

దారి మార్చి

చంద్రబాబును ఇంటి వద్దే వదిలేస్తారని భావించినా..... ఉన్నట్లుండి సీడ్‌ యాక్సిస్‌ రహదారిపైకి దారి మళ్లించారు. అక్కడి నుంచి కరకట్టపైకి వెళ్లకుండా వెంకటపాలెం వైపు మళ్లించారు. వెంకటపాలెం నుంచి ప్రధాన రహదారి గుండా కాకుండా చంద్రబాబు ఉన్న వ్యాన్‌ను డొంక రోడ్డు గుండా తిరిగి కృష్ణాయపాలెం తీసుకొచ్చారు. కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి తీసుకొచ్చారు.

చంద్రబాబు పాదయాత్ర

తమను ఎటు తీసుకెళ్తున్నారో స్పష్టత లేకపోవడం పట్ల నేతలు ఒక్కసారిగా మండిపడ్డారు. మంగళగిరి సందులో వాహనాన్ని ఆపి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయ స్వామిలు ఒక్కసారిగా వాహనం నుంచి కిందకి దూకి రోడ్డుకు అడ్డంగా బైఠాయించటంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఈలోగా పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకుని పోలీసు చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న తమ అధినేతను డొంక రోడ్డుల్లో తిప్పుతారా అంటూ డీఎస్పీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతలో చంద్రబాబు కూడా వాహనం దిగి పోలీసుల తీరుకు నిరసనగా మంగళగిరి వీదుల్లో పాదయాత్ర చేపట్టారు. నారా లోకేష్‌, ఇతర ఎమ్మెల్సీలు కూడా వీరికి తోడై పాదయాత్ర చేపట్టడంతో పోలీసులు అడ్డుకుని మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్​కు తరలించారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోగా రైతులను పరామర్శించే హక్కును కూడా ప్రభుత్వం కాలరాసిందని చంద్రబాబు ,తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఉద్రిక్తతల నడుమ విడుదల

మంగళగిరి పోలీస్‌స్టేషన్‌ వద్ద పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అర్ధరాత్రి దాటాక చంద్రబాబును ఆయన కాన్వాయ్‌లోనే ఎక్కించి ఇంటికి పంపించారు. ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వారి వారి వాహనాల్లో బయలుదేరారు.

ఇదీ చదవండి:పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

Last Updated : Jan 21, 2020, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details