గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, మెంబర్(కోఆప్టెడ్) పదవులకు ఈ నెల 8న జరగాల్సిన ఎన్నికను వారం రోజులు నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. కుల ధ్రువీకరణ పత్రం కోసం తెదేపా ఎంపీటీసీ సభ్యురాలు షేక్ జబీన్ అప్పీలును వారంలోనే పరిష్కరించాలని గుంటూరు కలెక్టర్కు స్పష్టం చేసింది. అప్పీలు పరిష్కారానికి నెల రోజులు కావాలని కలెక్టర్ తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) ఖాదర్ మస్తాన్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ పంచాయతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్ దాఖలు చేసిన అప్పీలును కొట్టేసింది. ఇదే వ్యవహారంపై ఎంపీటీసీ సభ్యురాలు డి.సంతోషరూపవాణి దాఖలు చేసిన మరో అప్పీలునూ కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
అసలేం జరిగింది...
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ (duggirala MPP) ఎన్నికపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నిక (duggirala MPP) వాయిదా వేయాలన్న తెదేపా ఎంపీపీ అభ్యర్థి షేక్ జబీన్ వినతిని పరిశీలించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జబీన్ కుల ధ్రువీకరణ పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం వారం రోజుల గడువు విధించింది. ఆ తర్వాత ఎంపీపీ (MPP elections) ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.