అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు కాలిపోగా.. రెండు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శివారు పితానివారిపాలెంలో ఈ సంఘటన జరిగింది. పొయ్యి నుంచి నిప్పులు పైకి ఎగిసి పడటంతో.. ఈ దారుణం సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిందిని.. పి.గన్నవరం ఆర్ఐ జి.సుబ్రహ్మణ్యం వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాంభట్ల సుధీష్.. బాధిత కుటుంబాలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని కోరారు.
రెండు పూరిళ్లు దగ్ధం.. 7 లక్షల రూపాయల ఆస్తి నష్టం
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో.. రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మూడు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. ఏడు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
కొత్తపేట మండలం మందపల్లికి చెందిన గ్రంధివారి వీధిలోని తాటాకు ఇల్లు అగ్నికి ఆహుతైంది. సిద్ధం శెట్టి పేరేశ్వరరావు, సిద్ధంశెట్టి వీర వెంకట సత్యనారాయణ కుటుంబాలు ఈ ఇంటిలో నివసిస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగి వ్యాపించాయని స్థానికులు తెలిపారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంటిలోని నగదు, దుస్తులు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారి నాగభూషణం తెలిపారు.
ఇదీ చదవండి:గుర్తుతెలియని జంతువు వరుస దాడులు