తనపై దాడి చేసినవారు వైకాపా కార్యకర్తలు కాదని.. కొందరు తెదేపా నేతలే వెనక నుంచి నడిపించారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి తలారి వెంకట్రావు పేర్కొన్నారు. దాడి చేసిన వారిలో గ్రామస్థులు ఎవరూ లేదని.. అందరూ కొత్తవారే అని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా జి. కొత్తపల్లిలో తనపై దాడులు జరగడం వెనుక ప్రధాన సూత్రధారులు తెదేపా నేతలే అని ఆయన అన్నారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు.
గంజి ప్రసాద్కు.. తనకు మంచి స్నేహం ఉంది. ఉదయం గంజి ప్రసాద్ హత్య వార్త తెలుసుకొని జి.కొత్తపల్లి గ్రామానికి వెళ్లాను. గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదాలు ఉండడం వాస్తవమే. గతంలోనే రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చాను. గంజి ప్రసాద్ హత్య వెనుక ఎవరు ఉన్న వదిలే ప్రసక్తే లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -తలారి వెంకట్రావు, గోపాలపురం ఎమ్మెల్యే
వైకాపా గ్రూప్ రాజకీయాలను తెదేపాకు రుద్దే కుట్రా: మూడేళ్లు తెదేపా నేతలపై కక్ష సాధించిన వైకాపా నేతలు.. చివరి రెండేళ్లు వాళ్లలో వాళ్లే చంపుకుంటున్నారని తెదేపా నేత, మాజీమంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. జీ.కొత్తపల్లి హత్య ఘటనపై మంత్రి కారుమూరి తెదేపా నేతలపై ఆరోపణలు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైకాపా గ్రూప్ రాజకీయాలను తెదేపాకు అంటగట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ హత్య వెనుక ఎమ్మెల్యే తలారి హస్తం ఉందని జవహర్ ఆరోపించారు.