చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు తాము అనుకున్నప్పుడు విదేశీ వంటకాల రుచి చూడొచ్చు. తమకిష్టమైనది వండించుకుని తినొచ్చు. ఇంటి దగ్గరే దమ్ బిరియానీ, హలీం, కబాబ్ వంటి భారతీయ వంటకాలు చేసేసుకోవచ్చు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా... దీని అంతటికి కారణం కరోనా. అవును మీరు విన్నది నిజమే. కరోనా కారణంగానే వారికి విదేశీ వంటకాలు తినే అవకాశం వచ్చింది.
లాక్డౌన్తో ఇంటి నుంచి బయటకు వెళ్లలేక... మాస్క్లు ధరించలేక... గంటకోసారి చేతులు కడుక్కోలేక... వీటన్నిటికి కారణమైన కరోనా మహమ్మారిపై ప్రపంచమంతా మండిపడుతుంటే.. దానివలనే ప్రపంచ వంటకాలు తమ ముంగిటకు వచ్చాయని చిత్తూరు జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగినేనిపల్లెకు చెందిన విజయ్ బాబు వృత్తిరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు మహేశ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ కలినరీ ఆర్ట్స్లో డిగ్రీ చదివారు. దుబాయ్లోని ప్రఖ్యాత హోటల్ అట్లాంటిస్ ది ఫామ్లో ఉద్యోగం సాధించారు. అనంతరం ప్రపంచంలోనే ఎత్తయిన హోటల్ జేడబ్ల్యూఎస్ మార్కస్లో చేరారు. తర్వాత సముద్రంలో ప్రయాణించే ప్రిన్సెస్ క్రూయిజ్లైనర్ షెఫ్గా కెరీర్ ప్రారంభించారు.
కరోనాతో ఇక్కడే ...
అందులో 9 నెలలు ప్రయాణించడం, 3 నెలలు సెలవులు ఉంటాయి. అలా ఐరోపా, అమెరికా, మధ్య ఆసియా, ఖండాలను చుట్టి గత ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చి, అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని ఇంటికి చేరుకున్నారు. మళ్లీ మే 15న ఉద్యోగానికి వెళ్లాల్సి ఉండగా కరోనా కారణంగా వెళ్లలేకపోయారు. అప్పట్నుంటి గ్రామంలోనే ఉన్న మహేశ్.. స్థానికులకు తన పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని పరిచయం చేశాడు. రంజాన్ మాసంలో తమ స్నేహితుడికి హలీం చేసి పెట్టారు. అలా తన వంటకాల రుచి అక్కడి వారికి చూపిస్తున్నాడు.