తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)లో పాలన పరమైన సమస్యలు తొలగించడానికి అదనపు సిబ్బంది నియామకానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. తుడా కార్యాలయంలో మూడో పాలకమండలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తుడా పరిధిలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.
లాక్డౌన్ కారణంగా తుడా వాణిజ్య సముదాయాల్లోని దుకాణాదారులకు 3 నెలల అద్దె మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. 58 లక్షల రూపాయల తితిదే నిధులతో రహదారి డివైడర్లు అభివృద్ధి చేయాలని తీర్మానం చేశారు. కార్యాలయంలోని ఖాళీ స్థలంలో రూ. 4.20 కోట్లతో భవన నిర్మాణం, తుడా విస్తరించిన 3315.4 చ.కి.మీ పరిధిలో బృహత్ ప్రణాళిక రూపొందించేందుకు న్యూ ఢిల్లీకి చెందిన సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ అసోసియేట్స్కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.