కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియమ నిబంధనల ప్రకారం... చిత్తూరు జిల్లా నుంచి తెలంగాణకు వెళ్లాలంటే... అక్కడి రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఈపాస్ను పొందాలని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు సూచించారు. వైద్యసహాయం నిమిత్తం వెళ్లే వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అక్కడి ఆసుపత్రులలో పడకలు ఖాళీ ఉందని వారు ఇచ్చే అనుమతి పత్రాన్ని సైతం వెంట పెట్టుకుని వెళ్లాలన్నారు. లేకుంటే సరిహద్దుల వద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. తమిళనాడు, కర్ణాటకలకు వెళ్లే అవసరం ఉన్న తిరుపతి అర్బన్ పరిధిలోని ప్రజలు సైతం సరైన అనుమతి పత్రాలతో వెళ్లాలన్నారు. ప్రజలు ఎటువంటి కష్టాలు పడకూడదనే ఈ సూచనలను ఇస్తున్నామన్నారు.
మరోవైపు సరైన కారణం లేకుండా కోవిడ్ నిబంధనలు, కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 10 రోజుల్లో అర్బన్ పోలీస్ పరిధిలో విపత్తు నిర్వహణ చట్టం కింద 9వేల 396 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో మాస్కులు ధరించలేదనే 9వేల 118కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులు ద్వారా పది రోజుల్లో 36లక్షల 36వేల 650 రూపాయలు జరిమానా విధించామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు. వైరస్ కట్టడి కోసం ప్రజలు కర్ఫ్యూ నిబంధనల అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.