విస్తరణ, అభివృద్ధికి చిత్తూరు జిల్లాలో పది రహదారులను ఎంపిక చేశారు. నిధుల కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంకు(ఎన్డీబీ) నుంచి అప్పు చేశారు. ఇవన్నీ వెంటనే అభివృద్ధికి నోచుకుంటాయనుకుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయ కోణంలో... బడా గుత్తేదారులకు అనువుగా ఉండేలా రహదారులను ఎంపిక చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాధారణ స్థాయి గుత్తేదారులెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా రాయలసీమలో ఇతర జిల్లాలతో కలిపి ప్యాకేజీగా రూపొందించి బడా కాంట్రాక్టర్లే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు మార్పు చేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఇద్దరు ప్రజాప్రతినిధులకు చెందిన సంస్థలే టెండర్లలో పాల్గొనే అవకాశం లభించింది. ఇద్దరు కలిసి టెండర్లలో పాల్గొనగా... వారికే ముందస్తు ఒప్పందం మేరకు లభించే అవకాశం ఉండగా.. తీవ్ర విమర్శలతో ప్రక్రియ వాయిదా పడింది. మరోసారి టెండర్లు పిలిచారు. ఇందులో కూడా ఇద్దరికి చెందిన సంస్థలే పాల్గొనే అవకాశం ఉంది. ఇతరులు పాల్గొనే స్థితి జిల్లాలో కనిపించడం లేదని సమాచారం.
● అప్పు ఇచ్చే బ్యాంకు : ఎన్డీబీ
● అభివృద్ధి చేసే రోడ్లు : 10
● ఎన్ని కిలోమీటర్లు : 107
● వెచ్చించే నిధులు : రూ.126 కోట్లు
ఇలాంటి రహదారులు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. ఓ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని జిల్లాలో రహదారుల విస్తరణ, అభివృద్ధి చేపట్టనున్నారు. ఎక్కువగా అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లకు మోక్షం కల్పించకుండా రాజకీయ కోణంలో ఇతర వాటికి అవకాశం కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి.