తనపై వైకాపా నాయకులు దౌర్జన్యానికి దిగారంటూ వైద్యురాలు అనితారాణి చేసిన ఆరోపణల నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సీఐడీ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని డాక్టర్ అనితా రాణి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో... జరిగిన ఈ ఘటనపై విచారణ కోసం తమకు సహకరించాలని సీఐడీ అధికారులు ఫోన్ చేశారని చెప్పారు. సీఐడీ అధికారులు తన ఇంటికి రావడానికి వీలు లేదంటూ...గేట్లకు తాళం వేశారు.
తనకు న్యాయం జరిగేలా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అనితారాణి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సీఐడీ విచారణ.. తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి మద్దతుగానే... సీఐడీ విచారణ ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ విషయంలో ఏపీ పోలీసులు ఏమి చేశారో అందరికీ తెలుసన్న ఆమె... సీఐడీ అధికారులెవరూ ఇంటికి వచ్చి తనను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఒకవేళ వస్తే.. హైకోర్టులో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.