ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆ రైల్వే స్టేషనే..వాళ్ల ప్రచార అస్త్రం!

By

Published : Apr 11, 2021, 2:16 PM IST

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీవారిని... దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో తిరుపతి రైల్వేస్టేషన్ నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. పెరుగుతున్న రద్దీ, జనాభాకు అనుగుణంగా స్మార్ట్‌ రైల్వేస్టేషన్‌కు ప్రణాళికలు రచించినా...పనుల్లో మాత్రం జాప్యమే జరుగుతోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఈ అంశమూ ప్రచార అస్త్రంగా మారింది. రైల్వేస్టేషన్ అభివృద్ధి తమ బాధ్యత అంటూ అభ్యర్థులు ఓట్లు వేట సాగిస్తున్నారు..

all parties campaign   for  Tirupati by elections
తిరుపతి రైల్వేస్టేషన్

తిరుపతి రైల్వేస్టేషన్

అత్యంత ప్రాముఖ్యత కలిగిన రైల్వే స్టేషన్లో ఒకటిగా...ఏ1 గ్రేడ్ జాబితాలో స్వచ్ఛ స్టేషన్‌గా జాతీయ స్థాయిలో తిరుపతి స్టేషన్‌ మూడో స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఈ స్టేషన్‌ పూర్తి స్థాయిలో అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఇదిగో ఈ అంశాన్నే లోక్ సభ ఉపఎన్నికల వేళ రాజకీయ పార్టీ ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. స్మార్ట్ రైల్వే స్టేషన్‌లో భాగంగా 450 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. తమను గెలిపిస్తే పార్లమెంట్ లోతమ వాణి వినిపించి స్టేషన్‌ అభివృద్ధికి పాడుపడతామని హామీలు గుప్పిస్తున్నారు.

ఎప్పుడవుతుందో..?

తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోతున్నా.. అందుకు తగినట్లుగా తిరుపతి స్టేషన్‌లో ప్లాట్ ఫాంల సంఖ్య లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సకాలంలో రైళ్లు చేరుకున్నా.. నిలిపేందుకు ఖాళీ లేకపోవటంతో.. గంటల తరబడి రేణిగుంట జంక్షన్‌లోనే ఆపేస్తున్నారు . తిరుపతి రైల్వేస్టేషన్‌పై రైళ్ల రాకపోకల ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో దక్షిణం వైపు చేపట్టిన ఆరో నెంబర్‌ ప్లాట్‌ఫారం పనులు తుదిదశకు చేరుకున్నాయి. కాస్తలో కాస్త మెరుగుగా తిరుచానూరు టర్మినల్‌ అభివృద్ధి పనులు జరుగుతున్నా అవి ఎప్పటికి పూర్తవుతాయనే విషయంలో స్పష్టత లేదు.

మా వల్లనే అభివృద్ధి

తాము అధికారంలోకి వస్తే.. పార్లమెంటులో స్టేషన్ అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయించటంతో పాటు.. రైల్వే ప్రాంగణాన్ని స్మార్ట్ ప్రాజెక్ట్ గా మారుస్తామని రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. చెన్నై ఎగ్మోర్ తరహాలో భూగర్భ రైల్వే లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం తుదిదశలో ఉన్న ఆరో ప్లాట్ ఫాం నిర్మాణం తరహాలో మరిన్ని ప్లాట్ ఫాంలను అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు .


తిరుపతి రైల్వే స్టేషన్ స్మార్ట్ స్టేషన్ గా మార్చే బాధ్యతను కేంద్రప్రభుత్వం తీసుకుందని భాజపా నాయకులు చెబుతున్నారు. భాజపా ఎంపీ అభ్యర్థి విజయం సాధిస్తే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దేందుకు ఆస్కారం కలుగుతుందని అంటున్నారు.

ఇప్పుడైనా సమస్య పరిష్కరిస్తారో లేదో..!

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న రాయల చెరువు రైల్వే గేటు, చంద్రగిరి సహా 12 రైల్వే క్రాసింగ్ గేట్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి.. రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఉపఎన్నికల వేళ నగర వాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి.తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం..

ABOUT THE AUTHOR

...view details