ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 12, 2019, 11:44 PM IST

Updated : Dec 14, 2019, 10:58 AM IST

ETV Bharat / state

ఉ'లొ'ల్లిపాయలు...ఎంతెంత బారులు..!

"ఓ కొత్త నంబరు నుంచి శ్రావ్యకి ఫోను వచ్చింది. ఆమె ఫోను లిఫ్ట్​చేయగానే హాయ్.. నేను నీ చిన్నప్పటి స్నేహితుణ్ని అంటూ ఓ వ్యక్తి మాటలు కలిపాడు. ఆ ఫోను కాల్ పరిచయం బలపడి ప్రేమ వరకూ దారితీసింది. మన ప్రేమ విషయాన్ని మీ తల్లిదండ్రులతో మాట్లాడతా అని మర్యాదస్తుడిలా ప్రవర్తించాడు. ఓ రోజు శ్రావ్యకు చెప్పకుండా వాళ్ల ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో శ్రావ్య తల్లిదండ్రులు ఇంట్లో లేరు. అదే అదునుగా ఆ వ్యక్తి శ్రావ్యను మాటల్లో పెట్టి మత్తుమందు ఇచ్చాడు. శ్రావ్య నిద్రలోకి జారుకోగానే.. నేరుగా వంట ఇంట్లోకి వెళ్లి..... ఉల్లిపాయలతో ఉడాయించాడు." ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ ఉల్లి జోక్ ఇది. అసలు ఉల్లికొరత కారణాలు విశ్లేషించే ప్రయత్నమే ఈ కథనం.

onion rates hike  and govt failure
ఉ'లొ'ల్లిపాయలు...ఎంతెంత బారులు..!

ఉ'లొ'ల్లిపాయలు...ఎంతెంత బారులు..!
దేశంలో ఉల్లిలొల్లి చేస్తోంది. నగదు, బంగారంలా ఉల్లి కూడా విలువైన వస్తువుల జాబితాలో చేరిపోయింది. మహిళామణులు బంగారాన్ని ఎంత భద్రంగా దాచుకుంటారో... నేడు ఉల్లిని కూడా అంత అపురూపంగా చూసుకుంటున్నారు. ఒకప్పుడు నేల, నీటి కోసం యుద్ధాలు జరిగితే ఇప్పుడు ఉల్లి కోసం యుద్ధాలు(వీధి) జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కిలోమీటర్ల మేర బారులు తీరిన ప్రజలు... సందు దొరికితే చాలు దొంగతనాలు.. పెళ్లిళ్లలో ఖరీదైన బహుమతులుగా ఉల్లి పాయలు… పెట్రోల్‌ కొట్టించుకోండి ఉల్లి గెలుచుకోండి అని ప్రకటనలు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఉల్లికేంద్రంగా పేలుతున్న జోకులకైతే లెక్కే లేదు. ఎక్కడ చూసిన ఉల్లి ఉల్లి ఉల్లి ... కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది ఈ ఉల్లి.

కేంద్రం పరిమితులు

ఎన్నడూ లేని స్థాయిలో ఉల్లిధరలు పెరగడంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఓవిధంగా చెప్పాలంటే చేతులెత్తేసినట్టు. జనవరిలో ఖరీఫ్ పంట చేతికందే వరకు పరిస్థితి ఇలానే ఉండొచ్చని తెలుస్తోంది. ఈలోగా పరిస్థితులు చేయిదాటకుండా ఉండటానికి , దేశీయ విపణిలో ఉల్లి సరఫరా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిల్లరవ్యాపారుల వద్ద ఉల్లినిల్వల పరిమితి 2 టన్నులకు తగ్గిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. చిల్లర వర్తకులు అక్రమంగా ఉల్లి నిల్వలు ఉంచకుండా.. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని.. కేంద్రం ఆదేశించింది. ఉల్లి నిల్వల పరిమితిని చిల్లర వర్తకుల వద్ద 10 టన్నుల నుంచి 5 టన్నులకు, టోకు వ్యాపారుల వద్ద 50 టన్నుల నుంచి 25 టన్నులకు కుదిస్తూ గతవారం ఆదేశాలు జారీ చేసిన కేంద్రం... ఇప్పుడు చిల్లర వర్తకుల వద్ద నిల్వ పరిమితిని రెండు టన్నులకు కుదించింది.

ప్రభుత్వ చర్యలేవి

అసలు ఈ స్థాయిలో ఉల్లి సంక్షోభం తలెత్తడానికి కారణాలు చాలానే ఉన్నా... అందులో ప్రధానంగా కనిపించేది మాత్రం ప్రభుత్వం ముందుగా అప్రమత్తంగా లేకపోవడం ఒకటి. ఈ ఉల్లి సంక్షోభం ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. గతంలోనూ ఇలాంటి కొరతలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కాని అప్పటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించలేదు. ఎప్పటికప్పుడు సంక్షోభం నుంచి బయటపడేందుకు మార్గాలు చూసుకోవడమే తప్ప భవిష్యత్‌లో సమస్య పునరావృతం కాకుండా చేసే ప్రయత్నాలు కనిపించడంలేదు. ప్రస్తుతం ఉల్లి సంక్షోభంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కంటి తుడుపును తలపిస్తున్నాయి.

ధరల్లో వ్యత్యసం

ఈ ఏడాది ఆగస్ట్‌ 29 నాటికి 2018-19 జున్‌-జులై కాలంలో ఉల్లి ఉత్పత్తి 23.28 మిలియన్‌ టన్నులుంటందని అంచనా వేసింది వ్యవసాయ మంత్రిత్వ శాఖ. గతేడాదితో పోలిస్తే అతి స్వల్పమైన పెరుగుదల ఇది. గతేడాది అంచనాలు 23.26 మిలియన్ టన్నులుగా ఉంది. అక్టోబర్ -మార్చిలో పండే పంటలో దాదాపు 65% ఏప్రిల్-అక్టోబర్​లో వాడకానికి నిల్వ చేస్తారు . అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో అకాల వర్షాలతో రబీ పంటకి భారీనష్టం వచ్చింది. ఆ ప్రభావం ఖరీఫ్ పంటపై కూడా పడేలా చేశాయి. 2012లో-13లో 16.81 మిలియన్‌ టన్నులుగా ఉన్న ఉత్పత్తి 2018-19 నాటికి 23.48 మిలియన్ టన్నులకు చేరుకుంది. అంటే 40% పెరుగుదల కనిపించింది. ఉత్పత్తి ఎక్కువగా జరగడం వలన ధరలు పడిపోయి ఉల్లి రైతులు నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.

ఆధునిక విధానాల్లో నిల్వ

దేశవ్యాప్తంగా సాధారణంగా ఉల్లి వినియోగం నెలకు 15 నుంచి 16లక్షల టన్నులుంటుంది. కాని గోదాముల్లో నిల్వఉంచేది మాత్రం పదిలక్షల టన్నులే. సంక్షోభం సమయంలో ఇవి ఏమూలకు సరిపోతాయన్నది పాలకులకే తెలియాలి. అలానే ఉల్లి పంపిణీకి సంబంధించి సరైన మౌలిక సౌకర్యాలు లేవు. ప్రజా పంపిణీ వ్యవస్థ తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా చౌక ధరల దుకాణాల ద్వారా ఉల్లిని సరఫరా చేసేందుకు సిద్ధంగా లేదు. ఉల్లి సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే నిల్వ చేసే విధానాలు మారాలి. ఆధునిక పద్ధతుల్లో నిల్వ చేయడంవల్ల రబీలో పంట నష్టం నుంచి కోలుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పుడు నిల్వ చేస్తున్న పద్దతుల వల్ల దాదాపు 30 నుంచి 40శాతం ఉల్లి పాడైపోతున్నాయి.

కృత్రిమ కొరత

ఉల్లి సాగు చేయించటంలో, మార్కెటింగ్, విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనలో కాని పాలకులు శ్రద్ధ పెట్టటంలేదు. ఉల్లి సాగు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా రైతులతో అనుసంధానమై పనిచేయని పరిస్థితి కారణంగానే ధరల్లో హెచ్చుతగ్గులతో రైతులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే తొలుత ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట కోల్పోయాక.... అక్రమ నిల్వలు పెట్టుకుంటున్న వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించేస్తున్నారు. మార్కెట్​లో ఉల్లి కృత్రిమ కొరత ఏర్పడ్డాక, నల్లబజారు వ్యాపారం పుంజుకొని వినియోగదారులు నష్టపోతున్నారు.

రాష్ట్రంలో పరిస్థితి

ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తుండగా, ఏటా కనిష్ఠ ధరల ప్రకారమే 125 కోట్ల రూపాయలు రైతులకు అందుతోంది. ఇంత పెద్దఎత్తున ఉల్లి సాగుచేస్తున్న రైతులు మార్కెట్ సౌకర్యంలేక, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు వెళ్లి విక్రయించు కోవాల్సివస్తోంది. కర్నూలు మార్కెట్ ఉన్నా, అక్కడ రైతుల నుంచి దళారులు కొనుగోలు చేసి తాడేపల్లిగూడెం తీసుకెళ్లి పొరుగు రాష్ట్రాల వ్యాపారులకు అధిక ధరకు విక్రయిస్తుంటారు. పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కర్నూలు మార్కెట్ కు నేరుగా వచ్చిన కొనుగోలు చేయకపోవటంతో మధ్య దళారులు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు.

పాఠం నేర్వని పాలకులు

ఉల్లిలో ఆధునిక వంగడాలు ఎక్కువగా ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేసినవే. మంచి వంగడాల హైబ్రీడ్ విత్తనాలతో రైతులు సాగుచేస్తున్నప్పటికీ, వాటిని ఉప ఉత్పత్తులుగా మార్చే పరిశ్రమలు దేశంలో ఏర్పాటుకాలేదు. ఉల్లికి ఉప ఉత్పత్తులు వచ్చినపుడే ప్రకృతి వైపరీత్యాలతో ఏర్పడే సంక్షేభం తట్టుకొని, వినియోగదారులకు కొరత రాకుండా చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా పాలకులు ఆలోచిస్తే ప్రజలకు ఉల్లి కష్టాలు తప్పుతాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠం నేర్చుకోవాలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి :

చికెన్ కొంటే... ఉల్లి ఉచితం..!

Last Updated : Dec 14, 2019, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details