తాగునీటి సమస్య పరిష్కారం విషయంలో రాజకీయం వద్దంటూ అనంతపురం జిల్లా కదిరి మండలం మొటుకుపల్లి వాసులు గ్రామ సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రామంలోని బోరు బావుల్లో నీటి మట్టం తగ్గి ఎద్దడి నెలకొంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించలేదు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇంఛార్జి కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఆయన స్పందించి ఇటీవల బోరు బావి తవ్వించారు.
పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు గ్రామస్తులు పనులు ప్రారంభించారు. ఇది తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు అనుమతి లేకుండా వేసిన బోరుకు విద్యుత్ కనెక్షన్ వద్దంటూ పంచాయతీ కార్యదర్శి, సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చారని గ్రామస్తులంటున్నారు.