పీపీఈ కిట్ల టెండర్ పిలుపు వల్ల చెన్నై ఏజెన్సీకి ప్రయోజనం చేకూరనుందని అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. టెండర్ల కమిటీలో నిపుణులను సభ్యులుగా నియమించలేదని, పీపీఈ కిట్లు తయారు చేసే సంస్థలే పాల్గొనేలా నిబంధలు పెట్టిన కూడా ..కొందరి వ్యక్తులకు మేలు చేసేందుకేనని ఆయన అన్నారు.
చెన్నైలోని ఏజెన్సీకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేషీ నుంచే టెండర్ ఖరారు చేయిస్తున్నారని ప్రభాకర్ విమర్శించారు. నాసీరకం పీపీఈ కిట్లు కొనుగోలు చేయటానికి సిద్ధమై, వైద్యులు, సిబ్బంది ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. టెండర్ల గడువు 11వరకేనని చెప్పిన ప్రభుత్వం, ఎవరికోసం గడువును మే 15 వరకు పొడిగించారో వైద్యఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేయాలని ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు కేవలం సామాన్య ప్రజలకేనని, వైకాపా ఎమ్మెల్యేలు వందలాది మందిని వెంటేసుకుని జాతరగా వెళుతున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తికి కారణం వైకాపా ఎమ్మెల్యేలేనని ఇప్పటికైనా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.