ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

'రాత్రంతా ఎక్కడికెళ్లావంటే.. వైఎస్‌ వివేకా ఇంటికెళ్లానన్నాడు'

YS Viveka murder case: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి తన కుమారుడు ఆయన ఇంటికి వెళ్లాడని ఆ కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్‌యాదవ్‌ తల్లి సావిత్రి వెల్లడించారు. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులకు గతేడాది జులై 4న ఆమె వాంగ్మూలమిచ్చారు.

By

Published : Mar 8, 2022, 6:14 AM IST

viveka murder case
viveka murder case

YS Viveka murder case: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి తన కుమారుడు ఆయన ఇంటికి వెళ్లాడని ఆ కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్‌యాదవ్‌ తల్లి సావిత్రి వెల్లడించారు. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులకు ఆమె వాంగ్మూలమిచ్చారు. అందులో ‘2019 మార్చి 14న రాత్రి 10 గంటలకు ఉమాశంకర్‌రెడ్డి నుంచి ఫోన్‌ రావడంతో సునీల్‌యాదవ్‌ ఇంటి నుంచి వెళ్లాడు. అర్ధరాత్రి దాటాక 1.30 సమయంలో ఇంటికి వచ్చాడు. కాసేపటికి మళ్లీ వెళ్లి, తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చాడు. రాత్రంతా ఎక్కడికెళ్లావని అడిగితే, కొన్ని విషయాలు మాట్లాడేందుకు ఉమాశంకర్‌రెడ్డితో కలసి వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లానని చెప్పాడు. తర్వాత తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఉదయం 5-6 గంటల సమయంలో ఉమాశంకర్‌రెడ్డి మా ఇంటికి వచ్చి సునీల్‌ని తీసుకెళ్లాడు’ అని ఆమె వాంగ్మూలంలో తెలిపారు. సునీల్‌యాదవ్‌ను సీబీఐ అధికారులు గతేడాది ఆగస్టు 2న గోవాలో అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో సీబీఐ అరెస్ట్‌ చేసిన మొదటి వ్యక్తి అతనే. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. అతని తల్లి సావిత్రి ఇచ్చిన వాంగ్మూలంలోని ముఖ్యాంశాలివీ!

వివేకా మా ఇంటికి చాలాసార్లు వచ్చారు..

‘మా కుటుంబం అనంతపురం జిల్లా నుంచి మూడున్నరేళ్ల క్రితం ఉపాధి కోసం పులివెందులకు వచ్చింది. మొదట భాగ్యనగర్‌ కాలనీలో ఉండేవాళ్లం. తర్వాత భాకరాపురంలో ఇల్లు అద్దెకు తీసుకున్నాం. సునీల్‌ యాదవ్‌ నా పెద్ద కొడుకు. ఏ పనికీ వెళ్లేవాడు కాదు. దస్తగిరి, ఉమాశంకర్‌ల వెంట తిరిగేవాడు. వారితోనే వివేకానందరెడ్డికి పరిచయమయ్యాడు. వివేకా చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. కొన్నిసార్లు దస్తగిరి, ఉమాశంకర్‌లతో, కొన్నిసార్లు ఎర్ర గంగిరెడ్డితో కలసి వచ్చారు. 2019 మార్చి 14కి రెండు రోజుల ముందు మా అక్క కుమార్తె యమున ముదిగుబ్బ నుంచి మా ఇంటికి వచ్చింది. సునీల్‌ అప్పటికే ఆమె దగ్గర రూ.10వేలు తీసుకున్నాడని, ఆ డబ్బు తెమ్మని తన భర్త ఒత్తిడి చేస్తున్నాడని చెప్పింది. డబ్బు తిరిగి ఇవ్వాలని సునీల్‌ను నిలదీసింది. ఇదే విషయమై మార్చి 14న రాత్రి యమునకు, సునీల్‌కు, నా భర్తకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. సునీల్‌ బాధ్యత తెలియకుండా, విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని ఆమె కేకలు వేసింది’ -సావిత్రి ,సునీల్‌యాదవ్‌ తల్లి

రాత్రంతా వెతికినా జాడలేదు..

‘యమునతో గొడవ తర్వాత ఉమాశంకర్‌తో ఫోన్లో మాట్లాడుతూ సునీల్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నా భర్త కృష్ణయ్య, చిన్నకొడుకు కిరణ్‌ చాలాచోట్ల వెతికి వచ్చారు. వివేకా ఇంటి వరకూ వెళ్లి వచ్చారు. రాత్రివేళ వాడు ఎక్కడికి వెళ్లి ఏం చేశాడోనన్న బెంగతో నాకు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి తన గదిలోకి వెళ్లిన కాసేపటికి, ఏం చేస్తున్నాడోనని వెళ్లి చూశాను. అప్పటికే నిద్ర పోయాడు. ఉదయం 5-6 గంటలప్పుడు ఉమాశంకర్‌ వచ్చి సునీల్‌ను తీసుకెళ్లాడు. ఉదయం 7.30కి ఇంటికి వచ్చిన సునీల్‌.. యమునను, ఆమె కుమారుడిని తీసుకుని ముదిగుబ్బకు వెళ్లాడు. వివేకా చనిపోయిన విషయం ఆ తర్వాత ఇరుగుపొరుగు ద్వారా నాకు తెలిసింది. తర్వాత పులివెందుల పోలీసులు వచ్చి సునీల్‌ గురించి అడగ్గా, ముదిగుబ్బ వెళ్లాడని చెప్పాను. పోలీసులు నా భర్తను విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. సునీల్‌ వచ్చాక పోలీసుస్టేషన్‌కు పంపాలని నాకు చెప్పారు. మార్చి 15న రాత్రి 7.30కి సునీల్‌ ముదిగుబ్బ నుంచి ఇంటికి వచ్చాక, పులివెందుల స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి పోలీసులు అతన్ని విచారణ కోసం కడపలోని డీటీసీకి తీసుకెళ్లారు’ అని సావిత్రి వివరించారు.

ఇదీ చదవండి:జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారు: బ్రదర్‌ అనిల్‌

ABOUT THE AUTHOR

...view details