Brutal Murder: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల తండాకు చెందిన కడావత్ రాజు హత్య కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. రాజును దారుణంగా చంపిన నిందితులు... తల, మొండెం వేర్వేరు చోట్ల పడేసిన ఘటన సంచలనం రేపింది. ఈ నెల 25 నుంచి రాజు కనిపించడం లేదని కుటుంబసభ్యులు.. బీడీఎల్ భానూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతని అనుచరుల ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేసిన పోలీసులు... కంది మండలం కవలంపేటకు చెందిన పల్లెపు రమేష్, నీరుడి విష్ణులను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో రాజును హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో రాజు తల, మొండాన్ని వేర్వేరు ప్రదేశాల్లో గుర్తించారు. హత్యకు వినియోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
భూవివాదమే కారణం
మృతుడు రాజు, సమీప బంధువు రాంసింగ్కు భూవివాదం నెలకొంది. వెలిమల తండాలోని భూమిని తక్కువ ధరకు అమ్మాలని కొంతకాలంగా రాజు ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాంసింగ్, వెంకటేష్, బాలు, మల్లేష్ హత్యకు పథకం వేశారు. 10లక్షల రూపాయలకు హత్య చేసేలా రమేష్, విష్ణుతో ఒప్పందం చేసుకున్నారు. వీరు మాధవ్ అనే మరో వ్యక్తిని కలుపుకున్నారు. మాధవ్ను భూమి కొనుగోలు చేస్తాడని మృతుడు రాజుకు రాంసింగ్ పరిచయం చేశాడు. భూమి కొనుగోలుకు సంబంధించి మాట్లాడాలని పిలిచి హత్య చేయాలని గతంలో రాజును రెండుసార్లు కలిశారు. కానీ హత్య చేయడానికి వీలు కాలేదు. ఈనెల భూమి కొనుగోలు కోసం వచ్చిన వ్యక్తి మాట్లాడేందుకు రమ్మంటున్నాడని ఈనెల 25న రాజుకు రాంసింగ్ ఫోన్ చేశాడు. ఇద్దరు కలిసి ఓ వెంచర్కు చేరుకోగా.. అప్పటికే రమేష్, విష్ణు, మాధవ్ మాటువేశారు. రమేష్ ఇస్నాపూర్లో ఓ గొడ్డలి, కత్తి, లీటర్ పెట్రోలు, మద్యం సీసా కోనుగోలు తమ వద్ద ఉంచుకున్నారు. ఐదుగురు కలిసి మద్యం సేవించగా.. విష్ణు, రమేష్, మాధవ్ కలిసి రాజును హత్య చేశారని పోలీసులు తెలిపారు.