ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 18, 2021, 11:12 AM IST

ETV Bharat / crime

Cyber Crime: ఆధార్‌తో పాన్‌కార్డు లింక్‌ చేశారా? క్లిక్​ చేస్తే చిక్కే!

ఆధార్‌తో పాన్‌కార్డు లింక్‌ చేశారా? అంటూ సందేశాలు పంపుతారు.. చెక్​ చేసుకుందామని క్లిక్​ చేస్తే.. ఇక అంతే సంగతులు.. సైబర్​ నేరస్థులు రూటు మార్చారు. ఇలా లింకులు పంపించి.. మీ ఖాతాను ఖల్లాస్​ చేసేస్తారు. తస్మాత్ జాగ్రత్త.

Cyber Crime
Cyber Crime

‘డియర్‌ కస్టమర్‌.. ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసేందుకు జూన్‌ 30తో గడువు ముగుస్తోంది. అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆధార్‌తో పాన్‌కార్డు లింక్‌ చేసుకోండి. కింద ఉన్న వెరిఫికేషన్‌ లింక్‌ను క్లిక్‌ చేసి ప్రక్రియ పూర్తి చేయండి..’

హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన నాగరాజు సెల్‌ఫోన్‌కు శనివారం వచ్చిన సంక్షిప్త సందేశమిది. ఇది ఒక్క నాగరాజుకే కాదు ఒకేసారి వందల సంఖ్యలో ఖాతాదారులకు ఇదే తరహా సంక్షిప్త సందేశాలు వచ్చాయి. పొరపాటున అది ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన సందేశమే కాబోలు అని లింక్‌ను క్లిక్‌ చేస్తే సైబర్‌ నేరస్థులు ఫోన్‌లో చొరబడే ప్రమాదం పొంచి ఉందని సైబర్‌క్రైమ్‌ విభాగం పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటూ బ్యాంకు ఖాతాదారులపై వల విసురుతున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌బీఐ ఖాతాదారులనే లక్ష్యంగా చేసుకొని నేరస్థులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

వాస్తవానికి కేవైసీ ప్రక్రియ గడువు ముగిసిందని, ఆధార్‌తో పాన్‌కార్డు లింక్‌ చేసుకోవాలని సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశాలు వస్తే అనుమానించాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. నిజంగా బ్యాంకులే సందేశం పంపితే వాటిలో లింక్‌ల ద్వారా ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు అవకాశం ఉండదన్న విషయాన్ని గుర్తించాలంటున్నారు. అందుకోసం బ్యాంకు శాఖనే సంప్రదించాలని సూచిస్తారని స్పష్టంచేస్తున్నారు. ‘‘సాధారణంగా సైబర్‌ నేరస్థులే ఇలా గంపగుత్తగా సంక్షిప్త సందేశాలు పంపిస్తుంటారు. ప్రస్తుతం ఐటీ రిటర్న్‌లను సమర్పించే గడువు దగ్గరికొస్తున్న తరుణంలో నేరస్థులు ఈ కొత్త తరహా మోసానికి తెర లేపారు. ఒకవేళ ఆ లింక్‌ను తెరిస్తే ఇక అంతే సంగతులు. అందులోని మాల్‌వేర్లు సెల్‌ఫోన్‌లోకి చొరబడతాయి. సెల్‌ఫోన్‌ నేరస్థుల అధీనంలోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో మొబైల్‌ బ్యాంకింగ్‌ విధానంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారి యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌, ఓటీపీ లాంటి రహస్య వివరాలన్నీ నేరస్థులకు ఇట్టే తెలిసిపోతాయి. వాస్తవ వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోనుంచి డబ్బులు కొల్లగొట్టేందుకు అవకాశాలుంటాయి. ఇతర వ్యక్తిగత సమాచారాన్నీ వారు తస్కరించే ప్రమాదం ఉంది. ఐటీ రిటర్న్‌లను ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలనుకుంటే ఆ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రక్రియ పూర్తి చేయాలి’’ అని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details