విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు అతి సమీపంలో ఉన్న మేఘాద్రి గడ్డ రిజర్వాయర్లోని నీటిని పారిశ్రామిక, తాగు, సాగు నీటి అవసరాలకు వినియోగిస్తారు. ద్రోణంరాజు సత్యనారాయణ సాగర్గా ఈ రిజర్వాయర్కి పేరు. ఎల్జీ పాలిమర్స్ స్టైరీన్ గ్యాస్ లీకేజీ జరిగిన నాటి నుంచి ఈ రిజర్వాయర్లోని నీటి వినియోగం నిలిపివేశారు. విశాఖ మహానగర పాలక సంస్థ తాగు నీటి అవసరాల కోసం రెండు టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్ నుంచే తీసుకుంటారు. స్టైరీన్ ఆవిరి లీకేజీ తర్వాత రిజర్వాయర్లోని నీరు కలుషితం అయిందని గుర్తించి.. ఈ నీటిని జీవీఎంసీ వినియోగించడం లేదు.
రిజర్వాయర్లోని నీటిని నీరి సంస్థ నిపుణుల బృందం పరీక్షించింది. ఐదు విధాలుగా మేఘాద్రి గడ్డ రిజయర్వాయర్లోని నీటిని పరీక్షించినట్లు వివరించారు. వివిధ శాతాలుగా రిజర్వాయర్లోని నీటికి మంచి నీటికి కలిపి పరీక్షించారు. 96 గంటల పాటు ఒక్కో తొట్టెలోను ఐదు ఆరోగ్యవంతమైన చేపలను ఉంచగా... వందశాతం మేఘాద్రి గడ్డ నీరు ఉన్న తొట్టెలో 72 గంటల తర్వాత రెండు చేపలు చనిపోయినట్టు గుర్తించారు.