కొవిడ్ రోగుల పాలిట సంజీవని ప్లాస్మా కరోనా కల్లోలంతో ప్రజలు సతమతమవుతున్న వేళ.. ప్లాస్మా దానంతో ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని వైద్యులు కోరుతున్నారు. కొవిడ్కు చికిత్సలో రోగుల పాలిట పలు సందర్భాల్లో ప్లాస్మా సంజీవనిగా మారుతోందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం డబుల్ మ్యుటెంట్గా ఉన్న వైరస్.. రోగులపై మరింత ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ప్లాస్మా అందిస్తేనే కచ్చితంగా ప్రాణం కాపాడగలిగే సందర్భాలు ఏర్పడుతున్నాయంటున్నారు. కొవిడ్ కోరల నుంచి బయటపడిన వారు.. వైరస్తో సాటి మనుషులు చేసే పోరాటంలో తమవంతు సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ప్లాస్మా కొరత తీవ్రంగా ఉన్నందున.. దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చినప్పుడే సంక్షోభాన్ని అధిగమించడం సాధ్యమని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి:100 కోట్ల డోసుల టీకా పంపిణీ పూర్తి!
రెండో విడత కొవిడ్ వ్యాప్తి సందర్భంగా ప్లాస్మా అవసరం మరింత పెరిగిందని విశాఖలోని ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకురాలు సుగంధి చెబుతున్నారు. ప్రస్తుతం ప్లాస్మా దానం పట్ల ప్రజల్లో అవగాహన కాస్త పెరిగినా.. మరింతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడే అమూల్యమైన అవకాశం పట్ల.. ఇప్పటికే ప్లాస్మా దానం చేసిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు డాక్టర్ సోనియా తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారు.. 15 రోజుల తర్వాత నుంచి ప్లాస్మా దానం చేయవచ్చని పేర్కొన్నారు. గతంలో కంటే ఇప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న మహమ్మారి నుంచి బాధితుల ప్రాణాలు కాపాడటంలో ప్లాస్మా కీలక ఆయుధంగా మారిందని గుర్తించాలని కోరారు.
ఇదీ చదవండి:'విశాఖ స్టీల్ ప్లాంట్ దేశానికి ఆక్సిజన్ సరఫరా చేస్తోంది'