ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం హిందుత్వ వ్యతిరేక విధానాలపై తెదేపా ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, తదనంతర పరిస్థితులు ఉద్దేశించి.. సీఎం జగన్​పై తెదేపా నేతలు ఘాటు విమర్శలు చేశారు. భక్తుల కోసం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక పథకాలను.. వైకాపా రద్దు చేసిందంటూ మండిపడ్డారు. దేవాదాయశాఖ నిధుల మళ్లింపుపై పట్టాభి, మతసామరస్య జీవోపై ఎమ్మెల్సీ అశోక్ బాబు, హిందుత్వ వ్యతిరేక విధానాలపై పంచుమర్తి అనురాధ విమర్శలు చేశారు.

By

Published : Jan 8, 2021, 7:52 PM IST

tdp leaders allegations on cm jagan
సీఎం జగన్​పై తెదేపా నేతల విమర్శలు

సీఎం జగన్ నిజమైన క్రైస్తవుడు కాదని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి కుటుంబం.. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తోందని ఆరోపించారు. సొంత బాబాయిని దారుణంగా చంపించమని, పేదల భూములు లాక్కోమని, ఎస్సీలపై దాడులు చేయాలని, వేలకోట్ల అవినీతికి పాల్పడమని.. బైబిల్​లో ఎక్కడ ఉందో జగన్ చూపించాలని డిమాండ్ చేశారు.

హిందూ ధర్మంపై అంత ప్రేమా?

విజయవాడలో చేపట్టిన ఆలయాల శంకుస్థాపన మరో రాజకీయ డ్రామా అని తెదేపా నేత పట్టాభి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 140 ఆలయాలపై దాడులు జరిగితే నోరు మెదపని సీఎం జగన్​కు.. అకస్మాత్తుగా హిందూ ధర్మంపై ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. అంత చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో రూ. 150 కోట్లతో నిర్మించతలపెట్టిన శ్రీవారి దేవాలయ నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. దేవాదాయశాఖ, బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు రూ.144 కోట్లను ఇతర పథకాలకు ఎందుకు మళ్లించారన్నారు. పేద భక్తులకు దివ్యదర్శనం పథకాన్ని ఆపేశారని.. కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద హరతిని రద్దు చేశారని గుర్తుచేశారు. దేవాలయ భూములను ఇళ్లపట్టాలకు కేటాయిస్తూ జీవోలు ఇవ్వడం, విగ్రహాల ధ్వంసం.. కుట్రపూరిత దాడుల్లో భాగమే అని ధ్వజమెత్తారు.

జీవోలో రాజకీయాలు, ఆర్థిక అంశాలా?

మతసామరస్యం కాపాడటానికి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రాజకీయ అంశాలను ప్రస్తావించడం సిగ్గుచేటని.. తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు దుయ్యబట్టారు. ఇవి ముమ్మాటికీ రాజకీయ వేధింపులు కోసం తీసుకొచ్చిన ఉత్తర్వులేనని ఆరోపించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు.. రాష్ట్రాన్ని 'అన్ జస్ట్, అన్ ఫెయిర్'​గా విభజిస్తూ తీర్మానంచేసి, ఆ ప్రతిపాదనను కేంద్రానికి పంపగలరా అని నిలదీశారు. ఆర్థిక అంశాలనూ జీవోలో ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు. మండిపడ్డారు. చంద్రబాబుతో పోల్చితే అప్పులు చేయడంలో మాత్రమే జగన్ ముందున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తొలగింపుకు, ధ్వంసానికి తేడా తెలియదా?

వైకాపా పాలనలో మహిళలతో పాటు దేవుడికీ రక్షణ లేదని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. హిందూమతాన్ని గౌరవించని జగన్​కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని మండిపడ్డారు. క్రైస్తవ మతాన్ని ఆచరించే వైవీ సుబ్బారెడ్డిని తితిదే ఛైర్మన్​గా నియమించడాన్ని తప్పుపట్టారు. దేవాలయాలు తొలగించడానికి, ధ్వంసం చేయడానికి తేడా తెలియని వారు వైకాపా నేతలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడు కొండలను రెండు కొండలుగా చేస్తూ వైఎస్ఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను.. చంద్రబాబు ఇచ్చారని అంబటి రాంబాబు అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

అక్క తప్పు చేసిందని పోలీసులు ఎలా చెప్తారు: భూమా మౌనిక

ABOUT THE AUTHOR

...view details