రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది గ్రామాల్లో పాగా వేయాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు(pilli manikyarao) డిమాండ్ చేశారు. దోమల తీవ్రతతో ప్రజలు డెంగీ, మలేరియా, ఇతర విషజ్వరాలతో అల్లాడుతుంటే ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని అవహేళన చేసిన మంత్రి బుగ్గన, ఇతర వైకాపా నేతలకు దోమల దెబ్బ తెలియాలంటే రోడ్లపైకి వచ్చి దోమలతో కుట్టించుకోవాలన్నారు.
వృద్ధులను మోసగించి చరిత్రలో మిగిలిపోతారు...
ఫించన్ల పెంపుపై మాట తప్పటంతో పాటు నిబంధనల సాకుతో లబ్ధిదారుల్ని తగ్గిస్తున్న జగన్ రెడ్డి.. వృద్ధులను మోసగించే ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా.. 300 రూపాయలు కూడా పింఛన్(pension news) పెంచకుండా 3వేల రూపాయల హామీని విస్మరించారని ఆమె మండిపడ్డారు. ఉన్న పింఛన్లకు కోత పెడుతూ.. వృద్ధుల కడుపు మాడుస్తున్నారన్నారు. ఇంట్లో ఒక్కరికే పింఛనని, ఇచ్చే సమయానికి ఇంట్లోనే ఉండాలనే నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించటం సిగ్గుచేటన్నారు.