ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మనలోనే మార్పు రావాలి.. ఓటే వారధి కావాలి

గ్రేటర్ హైదరాబాద్​ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగంపై చైతన్యం కోసం... సామాజిక కార్యకర్తలు, విశ్రాంత ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు తమవంతు విస్తృతం ప్రయత్నం చేస్తున్నాయి. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఓటు వేయకుంటే జరిగే అనర్థాలు వివరిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు పౌరులు కదిలి వెళ్లేలా... సంసిద్ధుల్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మార్పు కావాలంటే ముందు మనలో మార్పురావాలని.. అందుకు ఓటే వారధి కావాలని సూచిస్తున్నారు.

By

Published : Nov 30, 2020, 9:40 AM IST

social activists creating voter awareness for ghmc electionsghmc elections
మనలోనే మార్పు రావాలి.. ఓటే వారధి కావాలి

ప్రజాస్వామ్యంలో ఓటును మించిన... ఆయుధం లేదు. నచ్చిన నాయకుడిని ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగం ఎంతో అత్యవసరం. కానీ గ్రామీణ ప్రాంతాలతో పొలిస్తే... విద్యావంతులు అధికంగా ఉండే హైదరాబాద్‌ వంటి మహానగరంలో... ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదవుతోంది. అందుకే... ప్రభుత్వంతోపాటు పలువురు ప్రజానిధులు ఈ అంశంపై దృష్టిసారించి...ఓటర్లు పొలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఎన్నికల సంఘం సైతం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.... కొందరు ఆలక్ష్యం వహిస్తున్నారు. ఆ విషయం గుర్తించిన హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ప్రజాచైతన్య వేదిక.. బల్దియా ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపునకు తన వంతుగా కృషి చేస్తోంది.

  • ప్రజాచైతన్య వేదిక ఆధ్వర్యంలో..

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓటుహక్కును బాధ్యతతో సద్వినియోగం చేసుకుందామని.. పిలుపునిస్తోంది వనస్థలిపురం ప్రజా చైతన్య సమైక్యవేదిక. ఇంటింటా తిరుగుతూ నగరపౌరుల్లో ఓటుహక్కుపై తమదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు... సంస్థ ప్రతినిధులు. హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావటం పట్ల విద్యావంతులైన నగరవాసులు ఆలోచన చేయాలని హితవు పలుకుతున్నారు. పౌరులుగా విజయం సాధించాలంటే ప్రతిఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రజా చైతన్య సమైక్య వేదిక విజ్ఞప్తి చేస్తోంది.

రాష్ట్రంలోని కీలకమైన శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన.. విశ్రాంత ఉద్యోగులంతా కలిసి ప్రజాచైతన్య వేదికగా ఏర్పడ్డారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ, కార్పొరేషన్​.. ఏ ఎన్నికలు వచ్చినా... తమ వంతు బాధ్యతగా ముందుకొస్తున్నారు... ప్రజా చైతన్య ప్రతినిధులు. ఓటు హక్కుపై ప్రత్యేక కరపత్రాలు ముద్రించి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల శక్తి సామర్థ్యాలు ప్రజలకు వివరిస్తున్నారు. ఈక్రమంలో బల్దియా ఎన్నికల్లోనూ ఓటుహక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గృహా సముదాయాలు, జన సామర్థ్యం ఎక్కువగా ఉన్నచోటుకు వెళ్లి ఓటు ఎందుకు వేయాలో వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకొస్తున్నారు.

  • సెలవుగా చూడొద్దు..

ప్రజాచైతన్య సమైక్య వేదిక అధ్యక్షుడు మంగపతిరావు ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తున్న సభ్యులు...యువత ఓటింగ్‌కు దూరంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యావంతులు పొలింగ్‌కు దూరంగా ఉంటే సమాజం, చదువులకు ద్రోహం చేసిన వారవుతారని చెబుతున్నారు. రేపటి తరం భవిష్యత్ కోసం అర్హత కలిగిన వారంతా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సెలవు పేరుతో ఓటు హక్కును విస్మరించవద్దని సూచిస్తున్నారు.

  • అపవాదును చెరిపేయండి..

ప్రజాసమస్యల పరిష్కారానికి ఓటే ఆయుధమంటున్న సమైక్య వేదిక సభ్యులు... నోటుతో ఓట్లను కొనే వారి కంటే ప్రజాసేవ చేసే వారికే ఓటు వేద్దామని పిలుపునిస్తున్నారు. మహానగరం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే బాధ్యతగా ఓటు వేయడమే కాదు... నగర ప్రజలు ఓటింగ్ దూరంగా ఉంటారన్న అపవాదును చెరిపివేయాలంటున్నారు.

బాధ్యతాయుతమైన పౌరులు అనిపించుకోవాలంటే ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.. సామాజిక కార్యకర్త దోసపాటి రాము. ఎల్బీనగర్‌లోని తన నివాసం వద్ద 230 రోజులుగా రైస్ ఏటీఏం పేరుతో నిరుపేదల ఆకలి తీరుస్తున్న దోసపాటి రాము ... అక్కడికొచ్చే వారితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఓటర్లను చైతన్య పరుస్తున్నారు.

పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు, ఐటీ ఉద్యోగులు కూడా ఓటరు చైతన్యం కోసం పాటుపడుతున్నారు. హైదరాబాద్​లో 90% ఓటింగ్ నమోదయ్యేలా ప్రతి ఒక్కరు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా మహిళా ఓటర్లు ముందుకొచ్చి తమ శక్తిని చాటాలని కోరుతున్నారు.

బల్దియా ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా అవగాహన పెంచుతున్న స్వచ్ఛంద కార్యకర్తల కృషికి అన్నివర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తమవంతు బాధ్యతగా డిసెంబర్ 1న ఓటు వేసేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.

ఇవీచూడండి:

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

ABOUT THE AUTHOR

...view details