గత ఎన్నికల్లో ఓటమికి కారణాలను ఇప్పటికే విశ్లేషించుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీని మరింత బలమైన శక్తిగా మార్చే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. విజయవాడలోని కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ తొలి సమావేశాన్ని పవన్ నిర్వహించారు. ప్రజాక్షేత్రంలోకి చురుగ్గా వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ నాయకులందరూ ఒకే మాట, ఒకే సూత్రం అవలంబిస్తూ ఏకతాటిపై నడవాలని సూచించారు. తమతో నడవాలని కొన్ని పార్టీలు కోరుతున్నాయని.. ఏ పార్టీతో కలిసి వెళ్లినా లౌకిక పంథా విడనాడేది లేదని పవన్ స్పష్టం చేశారు. పార్టీ భావజాలాన్ని, ప్రజల సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తున్న రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ను అభినందించారు. ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియామకం నుంచి పార్టీ బలోపేతం వరకు అన్ని వ్యవహారాల్లో దూకుడు పెంచనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.
పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి... త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలు
జనసేనను మరే పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని అధినేత పవన్ కల్యాణ్ మరోమారు స్పష్టం చేశారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న పవన్ పార్టీ భవిష్యత్ అడుగులపై చర్చించారు. మరోమారు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లేందుకు నిర్ణయించారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జులను నియమించనున్నట్లు పార్టీ ప్రకటించింది.
పవన్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని ప్రస్తుతం 11మందితో ఏర్పాటు చేసినా, 18 మందికి దానిని పెంచేలా నిర్ణయించారు. ఓ వైపు కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తూనే మళ్లీ క్షేత్రస్థాయిలో పర్యటించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో భీమవరంలో పర్యటించి, పార్టీ కోసం పనిచేసి అనారోగ్యంతో చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం... తర్వాతి రెండు, మూడు నెలల్లో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలుస్తోంది.