ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులివ్వలేం: హైకోర్టు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిలిచిపోయిన దగ్గర్నుంచే నిర్వహించేలా ఎస్‌ఈసీ, ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేసేందుకు వీలు కల్పిస్తూ విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

By

Published : Mar 24, 2021, 4:53 AM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులివ్వలేం
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులివ్వలేం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిలిచిపోయిన దగ్గర్నుంచే నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్‌ఈసీ), ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేసేందుకు వీలుకల్పిస్తూ విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మంగళవారం ఈమేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ ఎన్నికలపై గుంటూరు జిల్లా పాలపాడు వాసి ఎం.రామిరెడ్డి హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే.

తగిన నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆదేశాలు ఇవ్వగలుగుతుంది: ‘ఎన్నికల సంఘం నిర్ణయాలపై న్యాయసమీక్ష జరపొచ్చని, ఆ నిర్ణయాలు న్యాయసమీక్షకు అతీతమైనవేమి కాదన్న ఏజీ వాదనలతో అంగీకరిస్తున్నాం. న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం. ఈనేపథ్యంలో ఎస్‌ఈసీ చర్యలు న్యాయసమీక్షకు లోబడి ఉంటాయని చెప్పడంలో న్యాయస్థానం సంశయించడం లేదు. వ్యాజ్యంలో పిటిషనర్‌ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని కోర్టు అభిప్రాయపడుతోంది. కమిషనర్‌కు పక్షపాతాన్ని ఆపాదించారు. కమిషనర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. అధికారపార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రమాణపూర్వకంగా పేర్కొన్నారు. దురుద్దేశాలు, మోసం గురించి వర్గీకరించారు. కౌంటర్‌ దాఖలు చేశాక ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడుతోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించి మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపిక ఈనెల 18తో ముగిసింది. ఆ ప్రక్రియ ముగియక ముందే ఈనెల 15న ఈ వ్య్యాజ్యాన్ని దాఖలు చేశారు. అథార్టీ తీసుకున్న నిర్ణయం తప్పు అని కోర్టు ఒకవేళ నిర్ధారణకు వచ్చినా.. తగిన నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆదేశాలు ఇవ్వగలుగుతుంది. ఫలానా విధంగా చేయాలని ఆదేశించలేదు. ఎస్‌ఈసీ ఉన్నతమైన రాజ్యాంగ సంస్థ. చట్టాల మేరకు వ్యవహరిస్తోందని ఆశించొచ్చు. కమిషనర్‌ మూడు రోజులు సెలవుపై వెళుతున్నారనే కారణం... విధులను వదిలేసి వెళుతున్నట్లు నిర్ధారణకు రావడానికి వీల్లేదు. పిటిషనర్‌ దురుద్దేశాలు ఆపాదించినందున ఎన్నికల కమిషనర్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోర్టు భావిస్తోంది. ఈదశలో మధ్యంతర ఉత్తర్వులు పొందడానికి పిటిషనర్‌కు హక్కు లేదు’ అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అంతకుముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌, ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ తమతమ వాదనలు వినిపించారు.

ఇదీచదవండి

బైపోల్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ

ABOUT THE AUTHOR

...view details