వ్యవసాయం, నీటిపారుదల యాజమాన్యంలో ఇజ్రాయెల్ సాధించిన విజయాలపై అన్నదాత కార్యనిర్వాహక సంపాదకుడు అమిర్నేని హరికృష్ణ రచించిన పుస్తకాన్ని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆవిష్కరించారు. ఇజ్రాయెల్ చరిత్ర, ఆవిర్భావంతో పాటు వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో ఈ ఎడారి దేశం అనన్యసామాన్యమైన ప్రగతిని అందుకున్న తీరును రచయిత ఈ పుస్తకంలో వివరించారు.
భారత్-ఇజ్రాయెల్ సంబంధాల్లో పొద్దు పొడిచిన నవశకం, అందుకు రెండు దేశాల ప్రధానులు మోదీ-నెతన్యాహుల మధ్య పెనవేసుకున్న స్నేహబంధం గురించి రచయిత పుస్తకంలో ప్రస్తావించారు. ప్రపంచ వ్యవసాయ సదస్సు-ప్రదర్శనలో భాగంగా ఇజ్రాయెల్ విదేశాంగశాఖ 2015లో దేశంలోని ఆరుగురు సీనియర్ పాత్రికేయులను ఎంపిక చేసి అధ్యయనం చేసేందుకు తమ దేశానికి ఆహ్వానించింది. ఈనాడు గ్రూపు తరఫున ఆ బృంద సభ్యుడిగా ఇజ్రాయెల్ సందర్శించిన హరికృష్ణ.. అక్కడి వ్యవసాయం, అనుబంధ రంగాలు, నీటిపారుదల రంగాల స్థితిగతులను పరిశీలించి "ఎడారిలో ఒయాసిస్సు- ఇజ్రాయెల్ వ్యవసాయం" అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకానికి రామోజీరావు ముందుమాట రాశారు.