DGP and APPSC Chairman meets Governor: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్, నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్ భవన్ దర్బార్ హాలులో గవర్నర్ తో విడివిడిగా సమావేశమయ్యారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా వీరికి స్వాగతం పలికారు.
పబ్లిక్ సర్వీస్ కమీషన్ చేపడుతున్న వివిధ ఉద్యోగ నియామక ప్రక్రియలను గురించి గౌతమ్ సవాంగ్.. గవర్నర్కు వివరించారు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను రూపొందించి అమలు చేస్తుందని, తదనుగుణంగా వారు నష్టపోని విధంగా కార్యాచరణ అమలు చేస్తామని పేర్కొన్నారు. ఎక్కువ మందికి ఉపాధి చూపే లక్ష్యంతో ప్రభుత్వం నిర్దేశిత ఉద్యోగ కాలమానిని రూపొందించటం మంచిదేనని గవర్నర్ అన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలు పూర్తి పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని నియామక ప్రకటనలు జారీ చేయాలన్నారు.