PCC Sailajanath on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిపాలన విధానాలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. నాడు పాదయాత్రలో దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఏపీపీసీసీ శైలజనాథ్ ప్రశ్నించారు. మాట తప్పి.. మడమ తిప్పిన జగన్ రెడ్డికి.. మద్యం అమ్మకాలే సంక్షేమ పథకాలను నడపడానికి దిక్కుగా మారాయని ఎద్దేవా చేశారు.
'మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అటకెక్కించి.. దేవుళ్లనూ మోసం చేసే స్థాయికి జగన్ దిగజారారు. ప్రతిపక్ష నేతగా నాడు.. కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతుందన్న జగన్కి... నేడు మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే సంక్షేమం సాగుతోందని గుర్తించారా?. నాడు మద్యం ద్వారా మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయన్న సీఎంకి... నేడు నాటుసారా తాగి ప్రాణాలు పోతున్నా అవి సహజ మరణాలుగా ప్రచారం చేయడం సిగ్గుచేటు' అని శైలజనాథ్ పేర్కొన్నారు.
Tulasi reddy on State Finance:వైకాపా పాలనలో ఆర్థిక అరాచకత్వం, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం.. పరాకాష్టకు చేరుకున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో రాష్ట్రం ఐపీ పెట్టాల్సి వస్తుందని విమర్శించారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకాన్ని ఐపీ బారి నుంచి తప్పించేటందుకు వెంటనే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని రాష్ట్రపతిని కోరారు.
'2020-21 లో రూ. 1.10 లక్షల కోట్లు శాసన సభ ఆమోదం లేకుండా ఖర్చు చేసినట్లు కాగ్ పేర్కొంది. రూ. 48వేల284 కోట్లు ప్రత్యేక బిల్లులు ద్వారా లావాదేవీలు నిర్వహించడం జరిగింది. బడ్జెటేతర అప్పు రూ. 86వేల 260 కోట్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పు 25 శాతం దాటకూడదని ఉన్నప్పటికీ రాష్ట్రంలో 36.4 శాతంగా అప్పు ఉంది. దేశంలోనే ఇది అత్యధికం. ఏడాదిలో 331 రోజులు రిజర్వు బ్యాంకు వద్దకు చిప్ప పట్టుకుని చేబదుళ్లకు పోయిందని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో రాష్ట్రం ఐపీ పెట్టాల్సి వస్తుంది' అని తులసి రెడ్డి విమర్శించారు.
ఇదీ చదవండి:సీఎం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాల్సిందే: సూర్యనారాయణ