ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతుందని ఎప్పుడూ ఊహించలేదని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయామని... దగా పడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు . పింగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు, వావిలాల గోపాలకృష్ణయ్య, కన్నెగంటి హనుమంతు, పొట్టిశ్రీరాములు వంటి మహనీయుల వారసులను సీఎం జగన్ సన్మానించారు. సన్మానంపై పొట్టి శ్రీరాములు మనుమరాలు ఆచార్య రేవతి ఆనందం వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామని సీఎం అన్నారు. నవరత్నాలను అమలు చేసి పేదల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటుచేసిన వివిధ రకాల స్టాల్స్ను సీఎం సందర్శించారు. సురభి నాటక కళా ప్రదర్శనను వీక్షించి కళాకారులను అభినందించారు.