గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాటపూడి రిటర్నింగ్ అధికారి వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఇటూరి కృష్ణవేణి, పోమేపల్లి ప్రభావతి, సోమేపల్లి లక్ష్మి నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు.. ఈ నెల 8న ఫాం 8ని ఆయన విడుదల చేసి నోటీస్ బోర్డులో ప్రదర్శించారన్నారు. సర్పంచిగా ఇటూరి అరుణ అనే మహిళా అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు గ్రామస్థులందరూ దృవీకరించుకున్నట్లు తెలిపారు.
తరువాత వైకాపా ప్రలోభాలకు తలొగ్గిన ఆర్వో.. అకస్మాత్తుగా ఫాం9 విడుదల చేసి సోమేపల్లి లక్ష్మీ పోటీలో ఉన్నట్లు ప్రకటించారని లేఖలో పేర్కొన్నారు. ఫాం8లో లేని పేరు ఫాం9లోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమవుతోందని.. తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ సీఐ, ఎస్ఐలపైనా చర్యలు తీసుకోండి...