జగన్ ప్రభుత్వానికి 'మందు' చూపు తప్ప.. ముందు చూపు లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కరెంటు కోతలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎగువ రాష్ట్రమైన తెలంగాణలోని జూరాల ప్రాజెక్టును కృష్ణా బోర్డు తన పరిధిలోకి తీసుకోకుంటే.. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడారు.
కృష్ణాబోర్డు కార్యాలయాన్ని తక్షణం తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు తరలించే విధంగా.. కృష్ణాబోర్డు పై ఒత్తిడి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో బహిరంగ మార్కెట్లో విద్యుత్ ను కొనుగోలు చేసి.. ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కడప జిల్లాలోని థర్మల్ పవర్ ప్లాంట్ ను, కృష్ణపట్నంలోని థర్మల్ పవర్ ప్లాంట్ ను దాదాపు ఏడాదిన్నరపాటు ప్రభుత్వం మూసివేసిందని గుర్తు చేశారు.