Srinivasa setu: తిరుపతి నగరవాసులతో పాటు.. శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి.. మూడేళ్ల క్రితం గురుడవారధి నిర్మాణాలు చేపట్టారు. స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ పేరుతో తిరుచానూరు మార్కెట్ యార్డు నుంచి.. కపిలతీర్థం సమీపంలోని నంది కూడలి వరకు.. గరుడ వారధి నిర్మిస్తున్నారు. తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్, తితిదే సంయుక్తంగా 684 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో.. 6 కిలోమీటర్ల మేర గరుడ వారధి నిర్మాణాలు చేపట్టాయి.
గరుడ వారధి నిర్మాణాల కోసం 458 కోట్ల రూపాయలు తితిదే, 226 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ వ్యయం చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే తితిదే నిధుల కేటాయింపులో జాప్యం జరుగుతుండటం వల్ల గరుడ వారధి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు మూడేళ్ల క్రితం వంతెన నిర్మాణాలు ప్రారంభమైనా.. నేటికీ ఓ కొలిక్కి రాలేదు. తితిదే తమ వాటా నుంచి కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాత్రం.. నిధులను మొత్తం మళ్లించి.. గరుడ వారధి నిర్మాణాలు ఆగకుండా కొనసాగిస్తోంది.
తిరుచానూరు మార్కెట్ యార్డు సమీపం నుంచి చేపట్టిన నిర్మాణాలు.. నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్నాయి. మార్కెట్ యార్డు నుంచి బస్టాండ్ వరకు పనులు అంతంతమాత్రంగా సాగుతుండగా.. బస్టాండ్ కూడలి నుంచి కపిలతీర్థం వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. బస్టాండ్ కూడలి నుంచి కపిలతీర్థం వరకు పనులు పూర్తవగా.. మిగిలిన ప్రాంతంలో ప్రారంభ దశలో ఉన్నాయి.