అమ్మానాన్నలు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కావడంతో ఈ నేలతో, ఇక్కడి వారితో అనుబంధం ప్రత్యేకంగా భావిస్తున్నారు నీలిమ. డల్లాస్లో యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న నీలిమ గోనుగుంట్ల సంస్థ తరఫున నిధులు సేకరించి భారతదేశంలోని పలు నగరాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, ఆక్సీమీటర్లు అందిస్తున్నారు. ఇంతవరకు సుమారుగా రూ.పది కోట్లకుపైగా విలువైన వస్తువులను అందజేశామంటున్న నీలిమ ప్రస్థానం తన మాటల్లోనే...
మా అమ్మ సురేఖ తూర్పుగోదావరి జిల్లాలోని కట్టమూరు గ్రామంలో పుట్టి పెరిగింది. నాన్న సత్యనారాయణ గోనుగుంట్ల వాళ్లది అనంతపురం. అమ్మ సీఏ, నాన్న ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగరీత్యా 1978లో అమెరికాలో స్థిరపడ్డారు. నేను పుట్టి పెరిగింది అమెరికాలోనే. బిజినెస్ లా పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏడేళ్లుగా డల్లాస్లోని యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలిగానూ పనిచేస్తున్నా. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమూ నాకు అలవాటు. రెండేళ్లకోసారి భారతదేశానికి అమ్మానాన్నలతో కలిసి వచ్చేదాన్ని. అలా అమ్మమ్మ, తాతయ్య, నాన్న తరపు బంధువులతో అనుబంధం పెరిగింది. అంతా బాగుంది అనుకున్న సమయంలో కరోనా కల్లోలం ప్రపంచ దేశాలని వణికించడం మొదలుపెట్టింది. అమెరికాలో దీని తీవ్రతని దగ్గరుండి చూశాను. అక్కడ అధునాతన వైద్యం అందుతుంది. జనాభా పరిమితంగా ఉంటారు. ఇన్నిరకాల సౌకర్యాలున్న యూఎస్లోనే కరోనా ధాటికి అనేకమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి భారత్ సంగతేంటా అని మనసులో ఆలోచనలు సుడులు తిరిగేవి.
మాతృభూమి రుణం తీర్చుకోవాలని..
నా ఆలోచనే నిజమైంది. ఇక్కడ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ అనేక మంది మృత్యువాత పడుతున్న వార్తలు టీవీలో చూసి మనసంతా దిగులుగా మారిపోయింది. ముఖ్యంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొరత గురించి వార్తల్లో చూసి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాయం చేస్తాం అనిపించింది. అలాచేస్తే మాతృభూమి రుణం కొంతైనా తీర్చుకోగలనేమో అనిపించింది. నేను అధ్యక్షురాలిగా ఉన్న యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు నా మనసులో మాటని వివరించా. అందరూ సానుకూలంగా స్పందించి సహకారం అందించారు. అలా ప్రవాస భారతీయులు, వైద్యులు, వ్యాపారులు అందరూ ముందుకు వచ్చారు. ఇక్కడ దేవాలయాలు, చర్చ్ల నిర్వాహకులు భక్తుల నుంచి కొంత సేకరించి ఇచ్చారు. మా ఛాంబర్లో ఉన్న వ్యాపారుల ద్వారా 200 మంది దాతలు ముందుకు వచ్చారు. అలా సేకరించిన నిధులతో ‘యూఎస్ఐసీఓసీ ఫౌండేషన్’ (యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్)ని స్థాపించాం. రూ.పది కోట్లు వెచ్చించి దిల్లీ, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో... 135 వెంటిలేటర్లు, 1001 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 300 ఆక్సీమీటర్లు అందజేశాం.