ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 15, 2020, 3:56 PM IST

Updated : Aug 15, 2020, 4:52 PM IST

ETV Bharat / city

జిల్లాలో భారీ వర్షం... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

పశ్చిమగోదావరి జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లావ్యాప్తంగా సగటున 58 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. వర్షంతో పలు గ్రామాలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంటపొలాలు నీట నానుతున్నాయి. గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద వరద ప్రవాహం 27.50 మీటర్లకు చేరింది. వరద వల్ల పోలవరం, వేలేరుపాడులోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పైడిపాక వద్ద గోదావరి గట్టు తెగిపోయి పోలవరం స్పిల్ వే వైపు వరద ప్రవహిస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో ఎడితెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భీమవరం, పాలకొల్లు, ఆచంట, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. వర్షంతో పలు గ్రామాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు, వీధులు, రహదారులు జలమయమయ్యాయి. జిల్లాలో సగటున 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట కాలువల్లో భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో వరి మడులు నీట మునిగాయి. పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు

లంకగ్రామాలకు స్తంభించిన రాకపోకలు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడం వల్ల ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద వరద ప్రవాహం 27.50 మీటర్లకు చేరుకుంది. గోదావరి వరదతో జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం, వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలేరుపాడు మండలం రేపాకుగొమ్మ, తాటకూరుగొమ్మ, తిరుమలాపురం, నార్లవరం, కటుకూరు, కోయిదా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సుమారు 15 గ్రామాల ప్రజలు నిత్యావసరాలు, వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం మండలంలోని కొండ్రుకోట, తాటగుంట, కొరటూరు పంచాయతీల్లోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం గ్రామం వద్ద వరద ఉద్ధృతి అధికంగా ఉంది. పాత పోలవరం వద్ద నెక్లెస్ బాండ్ బలహీనంగా మారడంతో ఇసుక బస్తాలు వేసి వరదను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వరదల్లో చిక్కుకొన్న గ్రామాలకు నిత్యావసరాలు, కూరగాయాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

పోలవరం స్పిల్ వే వైపు వరద ప్రవాహం

వరద పోటెత్తడంతో పోలవరం మండలం పైడిపాక వద్ద గోదావరి గట్టు తెగిపోయి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వైపు వరద నీరు నీరు చేరుతోంది. పోలవరం స్పిల్ వే వైపు వచ్చిన వరద.. పై గేట్లు, స్లూయిజ్ గేట్ల ద్వారా దిగువకు ప్రవహిస్తోంది. స్పిల్ ఛానల్ ద్వారా వరద ప్రవహించి.. తిరిగి గోదావరిలో కలుస్తోంది. ఎగువనున్న కాఫర్ డ్యాం వల్ల.. ప్రవాహం వెనక్కు వస్తోంది. ఈ కారణంగా వరద పోలవరం ప్రాజెక్టు వైపు వస్తోంది. ముందుస్తు జాగ్రత్తతో స్పిల్ వే వద్ద యంత్రసామగ్రిని పదిరోజుల కిందటే గట్టుకు తరలించారు. గోదావరిలో వరద పెరుగుతుండటం వల్ల.. మరింత వరద స్పిల్ వే వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి :సీఎం​ను తప్పుగా చూపించే కుట్ర జరుగుతోంది: హీరో రామ్

Last Updated : Aug 15, 2020, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details