రోడ్లపై ధర్నాలు, ట్రాక్టర్లతో ర్యాలీలు, మహా పాదయాత్రలు, రహదారి దిగ్బంధాలు, అసెంబ్లీ ముట్టడి, సామూహిక పారాయణాలు, దేవుళ్లకు పొంగళ్లు.. ఇలా విభిన్న రూపాల్లో అప్రతిహతంగా సాగుతున్న అమరావతి ఉద్యమంలో ముందుంటోంది అతివలే. రాజధాని సాధన పోరులో రైతులున్నారు, కూలీలున్నారు, ఎస్సీలున్నారు, బీసీలున్నారు, పదహారేళ్ల యువకులున్నారు, 60 ఏళ్ల వృద్ధులున్నారు.. వీరందరినీ ముందుండి నడిపిస్తోంది మహిళలే.! రాజధాని గ్రామాల్లోని ఏ దీక్షా శిబిరం చూసినా అతివల భాగస్వామ్యమే అధికం. ఓ వైపు ఇల్లు చక్కదిద్దుకుంటూనే.. ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారు. పండగైనా, పబ్బమైనా దీక్షా శిబిరాల్లోనే జరుపుకున్నారు. సంక్రాంతి నాడు రంగవల్లులను, గొబ్బెమ్మలను అమరావతి నినాదాలతో నింపేశారు.
అన్నింటా తామై...
ఓ విధంగా చెప్పాలంటే రాజధాని ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ.. మహిళా రైతులే. పొలాల్లో కంకులు కోసిన చేతులతో పిడికిళ్లు బిగించారు. తమ ఇంటి పెద్దలపై కేసులు పెట్టడం.. వారిలో కసి పెంచింది. పిల్లల భవిష్యత్ తలచుకుని తల్లడిల్లారు. ఆరునూరైనా అమరావతి అంగుళమూ కదలాడనికి వీల్లేదని నిశ్చయించుకున్నారు. నాటి ప్రభుత్వానికి భూములిప్పించడంలో ఎలాగైతే ఇంటిపెద్దకు నచ్చజెప్పారో.. అలాగే నేటి సర్కారుని దారికి రప్పించడంలోనూ ముందుంటామని చాటారు. ప్రత్యక్ష ఉద్యమంలోకి దూకారు. ఐకాస ఏ కార్యక్రమం తలపెట్టినా చిత్తశుద్ధితో పాలుపంచుకున్నారు.. లాఠీ దెబ్బలు తిన్నారు. పోలీసులు బూటు కాళ్లతో తన్నితే పంటిబిగువున భరించారు. పోలీస్టేషన్ల చుట్టూ తిప్పినా ఆత్మ స్థైర్యం కోల్పోలేదు. ఉద్యమ లక్ష్యం ముందు ఇవేమీ పెద్ద ఇబ్బందులు కావనుకున్నారు.
సంయమనమే శ్వాసగా...
అసెంబ్లీ ముట్టడి, జాతీయ రహదారి దిగ్బంధం వంటి కార్యక్రమాల్లో మహిళల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. శాంతియుత ధర్నా చేస్తున్న అతివలను వ్యాన్లలోకి ఈడ్చి పడేశారు, సీట్ల మధ్య కుక్కేశారు. పోలీసులు అర్థరాత్రిళ్లు తలుపుతట్టినా ఇదేమిటని నిలదీశారే గానీ.. మాట మీరలేదు, సంయమనం కోల్పోలేదు. పోరాటం ప్రభుత్వం విధానంపైన గానీ.. పోలీసులపై కాదని సముదాయించుకున్నారు. తమపై లాఠీ ఎత్తిన ఖాకీలకూ అన్నపానీయాలు అందించి.. మానవత్వాన్ని ప్రదర్శించారు.