ప్రవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం ....బలితీసుకుంది పసివాడి ప్రాణం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్లో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ 3 నెలల బాలుడు మరణించాడు.
అసలు ఏం జరిగిందంటే..
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఓ 3 నెలల బాలుడిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు సోమవారం రాత్రి శంకర్పల్లిలోని అమృత చిల్డ్రన్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్లు బాలుడికి చికిత్స అందించి.. ఇంటికి పంపించారు. రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో బాలుడికి మళ్లీ అదే సమస్య తలెత్తడం వల్ల వెంటనే హాస్పిటల్కు తీసుకొచ్చారు.
చెవిలో వేయాల్సిన మందు.. నోట్లో వేశారు..
వైద్యులు బాలుడికి నెబ్యూలైజర్ ద్వారా చికిత్స అందించారు. అయినా బాబు స్పందించకపోవడం వల్ల యాంటీబయోటిక్ చుక్కలు రాసి.. చెవిలో వేయమని నర్సు శాంతకు చెప్పారు. వైద్యులు చెప్పింది సరిగా వినని ఆమె.. చెవిలో వేయాల్సిన మందును కాస్తా.. నోట్లో వేసింది.
అప్పటికే చనిపోయాడు..
ఫలితంగా బాలుడి పరిస్థితి విషమించింది. వెంటనే మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. మరో ఆస్పత్రికి వెళ్తే.. బాబు చనిపోయి చాలా సేపయిందని డాక్టర్లు చెప్పారు. ఫలితంగా ఆగ్రహించిన కుటుంబ సభ్యులు అమృత హాస్పిటల్పై దాడికి దిగి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!