కక్ష సాధించేందుకు ముఖ్యమంత్రి హోదాను వాడుకుంటున్నారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రాన్ని పరిపాలించే పద్ధతి ఇదేనా అంటూ ప్రశ్నించారు. వైకాపా పాలనపై ఎన్ని విమర్శలు వచ్చినా సీఎం ఎందుకు స్పందించటం లేదన్నారు. ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్ సస్పెన్షన్పై క్యాట్ సైతం రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందన్నారు. ఐఆర్ఎస్ అధికారిని.. దర్యాప్తు, నివేదిక లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. కృష్ణకిషోర్ను ముందు సస్పెండ్ చేసి తర్వాత దర్యాప్తు చేస్తారా అని వర్ల రామయ్య నిలదీశారు. క్యాట్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగతి పబ్లికేషన్స్ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చినందుకే కృష్ణకిషోర్పై కక్ష సాధిస్తున్నారని వర్ల ఆరోపించారు.
ప్రభుత్వ కార్యాలయాలకు.. వైకాపా రంగులు వేసినందుకు హైకోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేశాయని వర్ల రామయ్య తెలిపారు. ఈ ప్రభుత్వం కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పీపీఏలు, పోలవరంపైనా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. వైకాపా నేతలు.. పాలనా వైఫల్యంపై ప్రజల దృష్టి మరల్చేందుకే రాజధాని మార్పు అంటున్నారని వర్ల రామయ్య విమర్శించారు. సీఎం జగన్ది డైవర్షన్ యాటిట్యూడ్ అని ఆరోపించారు. వైకాపా పరిపాలన.. దృష్టి మరల్చే దొంగలా ఉందన్నారు.