అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై రైల్వేశాఖకు సూచనలు చేసేందుకు తెలంగాణ పోలీసుశాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విమానాశ్రయాల తరహాలోనే రైళ్లలోకి వెళ్లే సామగ్రిని క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్బంగా నిందితులు పేలుడు పదార్థాలను రైల్లోకి చేర్చిన ఉదంతం నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి నివారించేందుకు దృష్టి సారించింది.
అదృష్టవశాత్తూ రైల్లో పేలలేదు
బిహార్లోని దర్బంగా రైల్వేస్టేషన్లో జూన్ 17వ తేదీన జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు సికింద్రాబాద్లో ఈ మూటను రైల్లోకి ఎక్కించినట్లు గుర్తించారు. తదనంతర దర్యాప్తులో ఈ మూటను బుక్ చేసిన.. హైదరాబాద్కు చెందిన నాసిర్ఖాన్, ఇమ్రాన్ మాలిక్లను అరెస్టు చేశారు. దర్బంగా రైల్లో పేలుడు జరిపి తద్వారా భారీగా ప్రాణనష్టం చేకూర్చే ఉద్దేశంతోనే దుస్తుల మూట మాటున మండే స్వభావం ఉన్న రసాయనాలతో చేసిన బాంబును రైల్లోకి ఎక్కించినట్లు తేలింది. అదృష్టవశాత్తూ కదులుతున్న రైల్లో పేలుడు సంభవించలేదు. ఒకవేళ జరిగి ఉంటే కనీసం మూడు బోగీలు నామరూపాలు లేకుండా పోయేవని అధికారులే చెబుతున్నారు.