ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 3, 2022, 10:41 PM IST

ETV Bharat / city

TS CM KCR Jharkhand Tour: రేపు ఝార్ఖండ్​కు తెలంగాణ సీఎం

TS CM KCR Jharkhand Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​... ఝార్ఖండ్ రాజధాని రాంచీకి శుక్రవారం వెళ్లనున్నారు. గాల్వాన్ అమరులకు పరిహారం అందించనున్నారు. రాంచీలో అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు.

TS CM KCR
TS CM KCR

TS CM KCR Jharkhand Tour: గాల్వాన్ అమరులకు ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2020 జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మనదేశానికి చెందిన 20 మంది సైనికులు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్​బాబు సహా మరో 19 మంది వీరమరణం పొందారు. సంతోష్ బాబుతో పాటు అమరులందరికీ తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

2020 జూన్ 19న ప్రధానమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు పరిహారం ప్రకటించారు. సంతోష్ బాబుకు ఐదు కోట్ల రూపాయలు, మిగతా 19 మంది సైనికుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రకటించారు. గతంలోనే సూర్యాపేటలోని సంతోష్​బాబు ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పరిహారంతో పాటు సంతోష్​బాబు సతీమణికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.

CM KCR Jharkhand Tour: మిగిలిన 19 మంది అమరుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. సీఎం కేసీఆర్ నేరుగా వెళ్లి ఆ కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. అమరులైన వారిలో బిహార్​కు చెందిన వారు ఐదుగురు, పంజాబ్ నుంచి నలుగురు, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమబంగ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. రేపు రాంచీకి వెళ్లి సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికసాయం అందించనున్నారు.

దిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్​ పర్యటన..

CM KCR Delhi Tour: దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ను.. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ సింఘ్ టికాయత్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్​ ఆహ్వానం మేరకు.. హస్తినలోని నివాసానికి విచ్చేశారు. వారి​తో కలిసి కేసీఆర్​.. మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

వ్యక్తిగత పర్యటన అని.. ఇప్పుడు..

ఫిబ్రవరి 28న దిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్​.. మంగళవారం(మార్చి 1న) దంత వైద్యం చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యురాలు పూనియా ఆయనకు చికిత్స చేశారు. చికిత్సలో భాగంగా బుధవారం మరోసారి వైద్యురాలిని కలిశారు. సీఎం సతీమణి శోభ బుధవారం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గతంలోనూ ఆమె అక్కడే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్​.. పలువురు విపక్ష నేతలను కలవనున్నారని ప్రచారం సాగినా.. మొదటి రెండు రోజులు అలాంటి కదలికలేమీ కనిపించలేదు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, రాజకీయపరమైనది కాదని తెరాసకు చెందిన ఓ సీనియర్‌ నేత తెలిపారు. కాగా.. పర్యటనలో మూడోరోజైన నేడు.. సుబ్రహ్మణ్యస్వామి, రాకేష్​ తికాయత్​ను లంచ్​కు ఆహ్వానించి.. భేటీ కావటం గమనార్హం.​

దిల్లీ యాత్రపై సర్వత్రా ఆసక్తి..

జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు పక్కా ప్లాన్​ చేస్తున్న కేసీఆర్​.. దిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాతీయ స్థాయిలో యాక్టివ్​ రోల్​ ప్లే చేసేందుకు కొత్త టీంను రెడీ చేస్తున్న కేసీఆర్ ఇప్పటికే.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. సినీనటుడు, రాజకీయ నేత ప్రకాశ్ రాజ్‌ను కలిసి భాజపాకు వ్యతిరేకంగా ఆయన మద్దతు కూడా కూడగట్టారు. ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని చెప్పడంతో.. ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ పర్యటనను ముందు చెప్పినట్టుగానే మూడు రోజులకే పరిమితం చేస్తారా..? లేక మరికొందరు నేతలతో భేటీ అవుతారా..? అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీచూడండి:TDP Polit Bureau Decisions:ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ లో...మహానాడు విజయవాడలో.. -తెదేపా

ABOUT THE AUTHOR

...view details