పురపాలికల్లో తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తెరుస్తామని తెదేపా ప్రకటించింది. పురపాలక ఎన్నికల కోసం 10 హామీలతో తెదేపా రూపొందించిన మేనిఫెస్టోను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుక్రవారం విడుదల చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలనపై లోకేశ్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ ముమ్మాటికీ పిరికివారేనని.. అందుకే ప్రత్యేక హోదాను, ఇప్పుడు విశాఖ ఉక్కును వదిలేశారని ఆరోపించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ఒక కమిటీ ద్వారా జరిగిందని, దానిలో వైకాపా ఎంపీ అవినాశ్రెడ్డి కూడా సభ్యుడని తెలిపారు. ‘కమిటీ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అవినాశ్రెడ్డి వ్యతిరేకించలేదు. ఇక ఆ పార్టీకి 22 మంది ఎంపీలు ఉండి ఏం సాధిస్తారు? స్టీల్ప్లాంటు ప్రైవేటీకరణే ఆపలేనివారు.. ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తారు?’ అని ఆయన మండిపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో 3నెలలపాటు 10వేల మందిని సర్వే చేసి మేనిఫెస్టో రూపొందించామని అన్నారు. స్థానిక సంస్థలకు నిధులివ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అయినప్పుడు.. గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ ప్రతిపక్ష పార్టీ ఎలా మేనిఫెస్టో విడుదల చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి అంటున్నారు కదా? అన్న ప్రశ్నకు... ‘కేంద్రం నుంచి కొన్ని నిధులు నేరుగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వస్తాయి. ఆర్థిక సంఘం నిధులూ నేరుగా పంచాయతీ ఖాతాలకు వస్తాయి. పంచాయతీరాజ్శాఖ మంత్రికి కనీస అవగాహన లేదు’ అని లోకేశ్ ధ్వజమెత్తారు.
పెద్దిరెడ్డి కాదు కదా... ఎవరూ ఏమీ చేయలేరు
'శాంతియుతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలోకి పుంగనూరు, కర్ణాటకల నుంచి మనుషులను తీసుకొచ్చి మా పార్టీ శ్రేణులను బెదిరించి దొంగ కేసులు పెట్టి పంచాయతీల్ని గెలుచుకున్నారు. రాష్ట్రమంతా అదే పరిస్థితి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు అక్కడ 30 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పెద్దిరెడ్డి కాదు కదా ఆయన బాబు వచ్చినా అక్కడ తెదేపాను ఏమీ చేయలేరు' అని లోకేశ్ అన్నారు.