తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ బంగాల్ తరహా రాజకీయ పరిణామాలు జరిగే ప్రమాదం ఉందని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరడంపై స్పందించిన ఆయన ఈటల చేరికను రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రంలో కూడా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని నారాయణ ఆరోపించారు. బంగాల్లో భాజపా, తృణముల్ కాంగ్రెస్ల మధ్య జరిగిన పోరులాంటిదే రాష్ట్రంలోనూ జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికైనా మేల్కోకపోతే వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.