మంచు, అకాల వర్షాలతో ఈసారి మామిడి పంట దిగుబడీ అంతంత మాత్రంగానే ఉంది. ఎంతోకొంత పంట చేతికొచ్చాక, దాన్ని అమ్ముకుని తెరిపిన పడదామనుకునేసరికి... కరోనా పిడుగు పడింది. కాస్త ముందుగా మామిడి కోతకొచ్చే... విజయనగరం, కృష్ణా జిల్లాలోని రెడ్డిగూడెం వంటి చోట్ల తొలి పంటను కొంత మంచి ధరలకే విక్రయించుకోగలిగారు. కృష్ణా జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పాటు, తూర్పు, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు వంటి జిల్లాల్లో ప్రస్తుతం... మామిడి పంట సీజన్ మధ్యలో ఉంది. గిరాకీ లేకపోవడంతో వచ్చిన ధరకే రైతులు మామిడి విక్రయించాల్సి వస్తోంది. పంట ఆలస్యంగా వచ్చే ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు తదితర ప్రాంతాల రైతులతో పాటు, అటు చిత్తూరు రైతులు... వచ్చే నెల కూడా కరోనా ఉద్ధృతి తగ్గకపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
కొనేవారేరీ..!
ఆంధ్రప్రదేశ్ నుంచి దేశం నలుమూలలకూ మామిడి ఎగుమతులు జరుగుతాయి. ముఖ్యంగా ముంబయి, దిల్లీ, ఇండోర్లు మన మామిడికి ప్రధాన మార్కెట్లు. అక్కడి నుంచి రీటెయిల్ మార్కెట్లకు, వారి నుంచి చిన్న విక్రయదారులకు మామిడి పళ్ల సరఫరా జరుగుతుంది. ఈసారి కరోనా వల్ల ఈ చైన్ మొత్తం దెబ్బతింది. దాదాపు ప్రతి రాష్ట్రంలో కరోనా ఆంక్షలు ఉన్నాయి. కొన్ని వర్గాలకు ఆదాయం కూడా తగ్గింది. ఇవన్నీ మామిడి మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. కరోనా తొలిదశలో రవాణాకి ఇబ్బందులు ఎదురైనా... మార్కెటింగ్కి ఇబ్బంది రాలేదని, ఈ సీజన్లో రవాణాపై ఆంక్షల్లేకపోయినా కొనేవాళ్లు లేక ధరలు పడిపోయాయని కృష్ణా జిల్లాకు చెందిన మామిడి ఎగుమతిదారులు చెబుతున్నారు. ‘‘కేరళ నుంచి గుజరాత్ వరకు విస్తరించిన సహ్యాద్రి ప్రాంతానికి ఈ సీజన్లో కృష్ణా జిల్లా నుంచి రోజూ 10 వేల టన్నుల మామిడి ఎగుమతి అవుతుంటుంది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తుపాను వల్ల వారం పది రోజులు సరఫరాలు నిలిచిపోయాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను కూడా ఎగుమతుల్ని దెబ్బతీస్తోంది’’ అని విజయవాడకు చెందిన మామిడిపళ్ల ఎగుమతిదారు అప్పారావు తెలిపారు.
పతనమైన ధరలు..!
కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 65-70 శాతం బంగినపల్లి రకమే పండిస్తారు. ఈ మూడు జిల్లాలో సుమారు 96 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఈ సంవత్సరం 12.23 లక్షల టన్నుల దిగుమతులు వస్తాయని అంచనా. కృష్ణా జిల్లాలో బంగినపల్లికి టన్నుకి రూ.15-20 వేల ధర లభిస్తోంది. కనీసం 30-40 వేలు ధర రావాలి. రెడ్డిగూడెం ప్రాంతంలో మార్చి నెలాఖరుకే పంట చేతికొచ్చింది. అప్పట్లో అక్కడ టన్ను రూ.50-60 వేలకూ విక్రయించారు. పిందె దశ నుంచీ సంచులు కట్టి పెంచిన పళ్లకు టన్నుకి రూ.90 వేల వరకు పలికింది. ఏప్రిల్ 15 నాటికి ధరలు బాగా తగ్గాయి. మే నాటికి మరింత పడిపోయాయి. ప్రస్తుతం రసాలు టన్ను రూ.8-10 వేలకు, తోతాపురి రూ.8,500 నుంచి రూ.10 వేలకు కొంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఇది వరకు మే నెలలో ముంబయి మార్కెట్కి రోజుకి 100 లారీల్లో పళ్లు పంపినా, సాయంత్రానికి అయిపోయేవి. ఇప్పుడు ఒక్కోసారి రెండుమూడు రోజులపాటు మార్కెట్కి సరకు పంపొద్దని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు’’ అని రెడ్డిగూడేనికి చెందిన ఎగుమతిదారు కృపారావు తెలిపారు.
కోతకొచ్చేసరికి పరిస్థితేంటో..!
కృష్ణా జిల్లా కంటే ప్రకాశం జిల్లాలో సుమారు నెల రోజులు ఆలస్యంగా మామిడి కోతకొస్తుంది. జిల్లాలో ఉలవపాడు మామిడికి పెద్ద మార్కెట్. గుంటూరు, విజయవాడ నుంచి వ్యాపారులు వెళ్లి, అక్కడ మామిడి కాయలు కొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అక్కడ ఇప్పుడిప్పుడే బంగినపల్లి మామిడి మార్కెట్కి వస్తోంది. ప్రస్తుతం హైవే పక్కన దుకాణాలు పెట్టి విక్రయించే వారే ఎక్కువగా కొంటున్నారు. టన్ను 30-40 వేల వరకు పలుకుతోంది. బంగినపల్లి కంటే ముందుగా వచ్చిన... రసాలు టన్ను రూ.15-20 వేలకు, నాటుకాయలు టన్ను రూ.7-10 వేలకు విక్రయించారు. తోతాపురి రకాన్ని టన్ను రూ.10 వేలకు కొనేవారు. ఇప్పుడు దాని ధర రూ.8 వేలకు పడిపోయింది. అక్కడ మరో 10-15 రోజుల్లో మామిడి పూర్తిగా పక్వానికొస్తుంది. అప్పటికీ కరోనా ఉద్ధృతి తగ్గకపోతే తమ పరిస్థితేంటని అక్కడి రైతులు ఆందోళన చెబుతున్నారు.