ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేడు కృష్ణా బోర్డు సమావేశం.. గుండ్రేవుల చర్చకు వచ్చేనా?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో... నేడు కృష్ణానదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాలు ఫిర్యాదుల్లో పేర్కొన్న డీపీఆర్​లతోపాటు నీటికేటాయింపులు, టెలిమెట్రీ సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. విజయవాడకు బోర్డు తరలింపు సహా మరికొన్ని అంశాలు అదనంగా చర్చించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. అధికారులు, ఇంజనీర్లకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే దిశానిర్ధేశం చేశారు. అయితే తుంగభద్రపై గుండ్రేవుల వద్ద జలాశయం ప్రాజెక్టు అంశం చర్చకు వస్తుందా? చూడాల్సి ఉంది.

By

Published : Jun 4, 2020, 5:56 AM IST

Published : Jun 4, 2020, 5:56 AM IST

krishna-river-management-board-meeting-in-jalasoudha
krishna-river-management-board-meeting-in-jalasoudha

కృష్ణానదీ యాజమాన్య బోర్డు 12వ సమావేశం... నూతన ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన హైదరాబాద్​ జలసౌథలో నేడు జరగనుంది. తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డితోపాటు బోర్టు సభ్య కార్యదర్శి మువాంతాంగ్, ఇతర సభ్యులు, ఇంజనీర్లు పాల్గొనున్నారు. రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాయి. అధికారులు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రులు దిశానిర్ధేశం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విషయంలో వాదనలు బలంగా వినిపించాలని అధికారులు, ఇంజనీర్లను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి ఆధారాలు ఇవ్వాలని సూచించారు.

పరస్పర ఫిర్యాదులు

శ్రీశైలం జలాశయం నుంచి మూడు టీఎంసీల నీటిని తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతల ప్రతిపాదన, పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకొంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా నిలువరించాలని కోరుతూ తెలంగాణ... అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టిందంటూ ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టరాదని రెండు రాష్ట్రాలకు బోర్డు స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కూడా త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది.

విద్యుత్​ వినియోగంపై..

తెలంగాణ ఫిర్యాదు చేసిన ఏపీలోని 15 ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసిన తెలంగాణలోని ఎనిమిది ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వాలని బోర్డు కోరింది. జూన్ 1 నుంచి 2020-21 నీటి సంవత్సరం ప్రారంభమైనందన... రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులతోపాటు విద్యుత్ వినియోగంపై కూడా చర్చించనున్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నుంచి నీరు తీసుకునే మార్గాల వద్ద రెండో దశ టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుతో పాటు మొదటి దశ టెలిమెట్రీ సమస్యలపై కూడా భేటీలో చర్చించనున్నారు. బోర్డు నిర్వహణా అంశాలైన బడ్జెట్, సిబ్బందిపై, మరికొన్ని అంశాలపై కూడా సమావేశంలో చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది.

రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం, ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులపై భిన్నవాదనల నేపథ్యంలో ఈ సమావేశం కీలకమయింది. తుంగభద్రపై గుండ్రేవుల వద్ద జలాశయం నిర్మాణంకోసం 2019లో పాలనామోదం ఇచ్చినా ఇంకా అడుగు ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనకరమన్న కోణంలో ఏపీ ఆలోచిస్తోంది. దీనివల్ల తెలంగాణలో అయిదు గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయి. వేదవతి, ఆర్‌డీఎస్‌ కుడి కాలువ, తుంగభద్రపై ఎత్తిపోతల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. రాయలసీమ ఎత్తిపోతలకు తాజాగా పాలనామోదం ఇచ్చారు. టెండర్లు పిలవాల్సి ఉంది.

రేపు 'గోదావరి' బోర్డు సమావేశం

వరద సమయంలో తీసుకున్న జలాలను లెక్కల్లోకి తీసుకోరాదని, సాగర్ ఎడమ కాల్వ నష్టాల గణాంకాలపై చర్చించాలని ఏపీ కోరింది. విభజన చట్టం ప్రకారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు విజయవాడకు తరలింపు, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు, బోర్డు పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులు తీసుకొచ్చే విషయమై చర్చించాలని విజ్ఞప్తి చేసింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు తొమ్మిదో సమావేశం కూడా రేపు జరగనుంది. రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదుల్లోని ప్రాజెక్టుల డీపీఆర్​లు, పెద్దవాగు ఆధునీకరణ, టెలిమెట్రీ ఏర్పాటు సహా ఇతర పాలనా పరమైన అంశాలను సమావేశ ఎజెండాలో పొందుపర్చారు.

ఇదీ చూడండి:ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా.. జులై 15 నుంచే

ABOUT THE AUTHOR

...view details