ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2022, 3:33 PM IST

ETV Bharat / city

Agnipath Protest in Secunderabad : సికింద్రాబాద్‌లో 'అగ్నిపథ్' అల్లర్లు.. పక్కా ప్లాన్‌తోనే..!

Agnipath Protest in Secunderabad : అగ్నిపథ్ పథకం తెలంగాణలోని హైదరాబాద్‌లో అగ్గిరాజేస్తోంది. వేల సంఖ్యలో యువకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను చుట్టుముట్టారు. కనిపించిన రైళ్లకు నిప్పు పెడుతూ.. స్టేషన్‌లోని స్టాళ్లను ధ్వంసం చేస్తున్నారు. రైళ్లు, బస్సులు, పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. రైల్వే స్టేషన్ ప్రాంగణం రణరంగంలా మారింది. అయితే ఈ విధ్వంసానికి ముందస్తు ప్రణాళిక జరిగినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన జరిగినట్లు సమాచారం.

అగ్నిపథ్ పథకం హైదరాబాద్‌లో అగ్గిరాజేస్తోంది
అగ్నిపథ్ పథకం హైదరాబాద్‌లో అగ్గిరాజేస్తోంది

Agnipath Protest in Secunderabad : అగ్నిపథ్‌ను నిరసిస్తూ తెలంగాణలోని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. ఆర్మీ ఉద్యోగ ఆశావహులు వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ సందేశాన్ని ముందుగానే సర్క్యులేట్‌ చేసినట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చి ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు సంఘటనలు జరిగిన తీరును చూస్తే అర్థమవుతోంది.

జిల్లాల నుంచి నిన్న రాత్రే చేరుకుని..అగ్నిపథ్‌ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆందోళనకారులు నిరసనకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. ఆందోళన కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి యువకులు గురువారం రాత్రే హైదరాబాద్‌ చేరుకున్నారు. జిల్లాల వారీగా వాళ్లంతా వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిరసన కోసం గురువారం రాత్రే అక్కడికి చేరుకున్నారు. తొలుత శుక్రవారం ఉదయం స్టేషన్‌ బయటే యువకులు కాసేపు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడే ఓ బస్సు అద్దాలను పగులగొట్టారు.

ఒక్కసారిగా దూసుకొచ్చి..ఆ తర్వాత ఉదయం 9 గంటల సమయంలో ఆందోళనకారులు ఒక్కసారిగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ లోపలికి దూసుకొచ్చి పట్టాలపై బైఠాయించారు. అనంతరం ప్లాట్‌ఫాంపై ఉన్న స్టాళ్లను తొలగించడం, స్టేషన్‌లో నిలిపిన పలు రైళ్ల కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత రైల్వే పార్సిల్‌ విభాగం వద్ద ఉన్న వస్తువులను తీసుకొచ్చి పట్టాలపై వేసి తగులబెట్టారు. ఆ తర్వాత ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పు పెట్టారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలు స్టేషన్‌లోకి వచ్చాయి. ఈ క్రమంలో వాళ్లపై ఆందోళనకారులు రాళ్ల వర్షం కురిపించారు. అప్పటికే పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్‌ చేయడం, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించినా ఆందోళన సద్దుమణగక పోవడంతో రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

  • ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details