కృష్ణా జిల్లాలో..
కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు లుపిన్ కంపెనీ ముందుకు వచ్చింది. రూ. 6.3 లక్షల విలువైన .. 15 లక్షల బీటామితసోన్ టాబ్లెట్లను సంస్థ ప్రతినిధులు.. జాయింట్ కలెక్టర్ శివశంకర్కు అందజేశారు. కొవిడ్ చికిత్సలో ఇవి ఉపయోగపడతాయని వారు తెలిపారు. బీటామితసోన్ టాబ్లెట్లను ఇంజక్షన్లకు బదులుగా స్టెరాయిడ్ గా వినియోగిస్తారని తెలిపారు.
గుంటూరు జిల్లాలో..
కరోనా కష్టకాలంలో మరింత ఉదారంగా పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. గుంటూరులోని సుద్దపల్లిడొంక ప్రాంతంలో పార్టీ తరఫున నిరుపేదలకు భోజనాన్ని అందించారు. సీపీఐ ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం రాష్ట్రంలో మూడుచోట్ల ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పట్టణాల్లో పేదలను ఆదుకునేలా వివిధ సహాయ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లాలో..
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరానికి చెందిన రావూరి వెంకట త్రిమూర్తులు, పూల ప్రసాద్ అనే చిరు వ్యాపారులు తమకు తోచినంతలో ఇతరులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. గత సంవత్సరం విజయదశమి రోజు నుంచి ప్రతిరోజూ ఐదుగురికి అన్నదానం చేస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో.. రోజూ 20 మందికి భోజన ప్యాకెట్లను అందిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వందురుగుంట ప్రాంతానికి చెందిన రెండు సంవత్సరాల చిన్నరి బాలుడు క్యాన్సర్తో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటికి పెద్ద దిక్కు అయిన సుబ్బరాయుడు ఆ చిన్నారి బాలుడు వైద్యం కోసం వెళ్లి వచ్చే క్రమంలో కరోనా సోకడంతో కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న సిరిమామిళ్ళ చెంచయ్యనాయుడు ట్రస్ట్ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. వారికి రూ. 20 వేలు నగదు సాయం చేశారు.