ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా సమయంలో నిరుపేదలకు సాయం చేస్తున్న దాతలు

కరోనా కష్టకాలంలో పనులు లేక.. పస్తులుంటున్న నిరుపేదలు ఎందరో ఉన్నారు. దీనికి తోడు కర్ఫ్యూ ఆంక్షలతో బతకడం కష్టమైన నిరుపేదలకు అనేక మంది దాతలు తమవంతుగా సాయం అందిస్తున్నారు. కొందరు రోజూ ఆహారం అందిస్తుండగా.. మరికొందరు సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. తమలాగే ఔదార్యం ఉన్నవారు ఇతరులకు సహాయం చేయాలని వారు కోరుతున్నారు.

By

Published : Jun 1, 2021, 5:23 PM IST

donors helping poor
కరోనా సమయంలో నిరుపేదలకు సాయం చేస్తున్న దాతలు

కృష్ణా జిల్లాలో..

కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు లుపిన్ కంపెనీ ముందుకు వచ్చింది. రూ. 6.3 లక్షల విలువైన .. 15 లక్షల బీటామితసోన్ టాబ్లెట్లను సంస్థ ప్రతినిధులు.. జాయింట్ కలెక్టర్ శివశంకర్​కు అందజేశారు. కొవిడ్ చికిత్సలో ఇవి ఉపయోగపడతాయని వారు తెలిపారు. బీటామితసోన్ టాబ్లెట్లను ఇంజక్షన్లకు బదులుగా స్టెరాయిడ్ గా వినియోగిస్తారని తెలిపారు.

గుంటూరు జిల్లాలో..

కరోనా కష్టకాలంలో మరింత ఉదారంగా పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. గుంటూరులోని సుద్దపల్లిడొంక ప్రాంతంలో పార్టీ తరఫున నిరుపేదలకు భోజనాన్ని అందించారు. సీపీఐ ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం రాష్ట్రంలో మూడుచోట్ల ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పట్టణాల్లో పేదలను ఆదుకునేలా వివిధ సహాయ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరానికి చెందిన రావూరి వెంకట త్రిమూర్తులు, పూల ప్రసాద్ అనే చిరు వ్యాపారులు తమకు తోచినంతలో ఇతరులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. గత సంవత్సరం విజయదశమి రోజు నుంచి ప్రతిరోజూ ఐదుగురికి అన్నదానం చేస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో.. రోజూ 20 మందికి భోజన ప్యాకెట్లను అందిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వందురుగుంట ప్రాంతానికి చెందిన రెండు సంవత్సరాల చిన్నరి బాలుడు క్యాన్సర్​తో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటికి పెద్ద దిక్కు అయిన సుబ్బరాయుడు ఆ చిన్నారి బాలుడు వైద్యం కోసం వెళ్లి వచ్చే క్రమంలో కరోనా సోకడంతో కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న సిరిమామిళ్ళ చెంచయ్యనాయుడు ట్రస్ట్ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. వారికి రూ. 20 వేలు నగదు సాయం చేశారు.

చిత్తూరు జిల్లాలో..

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పీహెచ్​సీలకు ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి కరోనా చికిత్సకు అవసరమైన మందులను అందించారు. రోజా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని గొల్లపల్లి, పుత్తూరు అర్బన్, పరమేశ్వర మంగళం, నగరి అర్బన్, బుగ్గ అగ్రహారం, నిండ్ర, విజయపురం పీహెచ్​సీల వైద్యాధికారులకు వైద్యపరికరాలు, మందులను పుత్తూరులోని వైకాపా కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి వైకాపా నేతలు, ప్రముఖులు హాజరయ్యారు.

అనంతపురం జిల్లాలో..

కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నగర శుభ్రత కోసం నిత్యం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అనంతపురంలో నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్ తమ వంతు బాధ్యతగా నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టినట్లు ట్రస్ట్ ఛైర్ పర్సన్ నిర్మలమురళి తెలిపారు. 22 రకాల వస్తువులను రూ.15 వేల ఖర్చుతో 15 కుటుంబాలకు అందించినట్లు తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు సహాయం చేయడానికి మరింత కృషి చేస్తామన్నారు. కరోనా కాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని కొనియాడారు.

విజయనగరం జిల్లాలో..

కరోనా కష్టకాలంలో పేదల కడుపు నింపేందుకు కూరగాయలు, నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే అలజంగి జోగారావు అందించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో తన పుట్టిన రోజు సందర్భంగా రెండు వేల మంది నిరుపేదలకు సరుకులు పంపిణీ చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ కట్టడికి అందరూ తమవంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు.

ఇవీ చదవండి:

'అనాథలైన పిల్లల కోసం కేంద్రం ఏం చేస్తోంది?'

Oxygen Express : ఖాళీ లారీ ట్యాంకర్లతో ఒడిశా తరలిన ఆక్సిజన్ రైలు

ABOUT THE AUTHOR

...view details