ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 25, 2021, 5:30 PM IST

ETV Bharat / city

మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ వాసులు.. వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు!

విశాఖ వాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవకముందే హెచ్​పీసీఎల్​లో తాజాగా భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో .. చుట్టపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. గతంలో హెచ్​పీసీఎల్​లో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదాలే కాకుండా ఇటీవల కాలంలో పారిశ్రామిక వాడల్లో జరుగుతున్న ఆకస్మిక అగ్నిప్రమాదాలు, మరణాలు, ఆస్తి నష్టాలు.. స్థానికులను కలవరపెడుతున్నాయి. ఈ మధ్య కాలంలో విశాఖ ప్రాంతంలోని వివిధ పరిశ్రమల్లో జరిగిన అగ్ని ప్రమాదాలు.. ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిలో కొన్నింటిని చూస్తే..

fire accidents in visakhapatnam
హెచ్‌పీసీఎల్‌ సీడీయూ 3వ యూనిట్‌లో అగ్నిప్రమాదం

ఇటీవల విశాఖలో జరిగిన ప్రమాదాలు:

  • మే 25, 2021- హెచ్​పీసీఎల్​లో అగ్నిప్రమాదం జరిగింది. క్రూడ్​ డిస్టిలేషన్ యూనిట్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ​ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో.. విశాఖ వాసులంతా ఊపిరి పీల్చుకున్నారు.
  • ఏప్రిల్ 11, 2021- దువ్వాడలోని సెజ్​లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా.. సెజ్‌లోని పూజా స్క్రాప్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి.
  • జనవరి 27, 2021- విశాఖలోని అగనంపూడి పారిశ్రామిక పార్క్​లోని వంట నూనెల కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొంత మేర ఆస్తి నష్టం జరిగింది.
  • నవంబర్ 5, 2020 - విశాఖ జిల్లా స్టీల్‌ప్లాంట్ పవర్‌ప్లాంట్-2లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టర్బైన్‌ ఆయిల్‌ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన వల్ల 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటార్లు దగ్ధమయ్యాయి.
  • జూలై 27, 2020 -విశాఖపట్నం విమానాశ్రయం సమీపంలోని షీలానగర్​ సీఎఫ్​ఎస్ కంటైనర్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది.
  • మే 7, 2020 - రాష్ట్రంలోనే అత్యంత దుర్ఘటన చోటు చేసుకుంది. విశాఖ నగరంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. చాలామందిని.. నేటికి ఆరోగ్యపరమైన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. విషవాయువు దెబ్బకు సమీప గ్రామాల్లో వాతావరణం పూర్తిగా కలుషితమైంది.
  • ఆగస్టు 6, 2019 - విశాఖ ఎయిర్ పోర్టు ఎదురుగా ఉన్న కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యార్డులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 3 కంటైనర్లు ఒక క్రేన్ దగ్ధమయ్యాయి. కంటైనర్ ను ఎత్తే సమయంలో క్రేన్ లో చక్రాలు విడిపోయి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు నిర్ధరించారు. కోట్ల రూపాయలలో నష్టం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details