తెలుగు రాష్ట్రాల్లో నల్ల ధాన్యాన్ని రైతులు పండిస్తుండటంతో ఈ ఏడాది సాగు బాగా పెరిగింది. ఈ అన్నంలో అనేక రకాల పోషకాలు, విటమిన్లు, అమినో ఆమ్లాలు ఉండటం వల్ల వీటిని తినేందుకు ఉన్నత విద్యావంతులు ఆసక్తి చూపుతున్నారు. నగరాల్లోని మాల్స్లో వీటిని ప్రత్యేకంగా అమ్ముతున్నారు. కిలో నల్ల బియ్యం ధర రూ.100 నుంచి రూ.120 దాకా పలుకుతోంది. కానీ ఈ రకం వరి విత్తనాలను రూ.200 నుంచి 300 దాకా ప్రైవేటు విత్తన కంపెనీలు విక్రయిస్తున్నాయి.
*నల్ల ధాన్యాన్ని చైనాలో ఎక్కువగా పండించేవారు. పూర్వకాలంలో అక్కడి రాజవంశీయులు, చక్రవర్తులు ఎక్కువగా తినడం వల్ల నల్లబియ్యానికి ‘చక్రవర్తుల బియ్యం’(ఎంపరర్ రైస్) అనే పేరు వచ్చింది. మనదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. చైనాకు దగ్గరగా ఉన్నందున ఈశాన్య భారత ప్రజలు వీటిని ఎక్కువగా తింటుంటారు.
*తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్, సిరిసిల్ల, మహబూబ్నగర్, పెద్దపల్లి, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో కొందరు ఈ ఏడాది సాగు చేస్తున్నారు.
*సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన ఓ రైతు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఆన్లైన్లో ఈ వరి విత్తనాలు కిలో రూ.200కి కొని సాగు చేయించి అర ఎకరంలో వేయించారు. 5.50 క్వింటాళ్ల దిగుబడి రాగా ఆన్లైన్లోనే పెట్టి విత్తనాల కింద కిలో రూ.275కి సాఫ్ట్వేర్ ఇంజినీరు విక్రయించారని జిల్లా వ్యవసాయాధికారి కె.రణధీర్రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. ఈ జిల్లాలో కోనరావుపేట, బోయిన్పల్లి ఎల్లారెడ్డిపేట, రుద్రంగి తదితర మండలాల్లో రైతులు వేసిన పంటను పరిశీలించినట్లు చెప్పారు.
*వ్యవసాయశాఖ రాయితీపై రైతులకు విక్రయించే విత్తనాల్లో నల్లని రకాలు లేవు. వీటిని ప్రభుత్వ పరిశోధన సంస్థలు విడుదల చేయలేదని, కొన్ని ప్రైవేటు కంపెనీలు అమ్ముతున్నాయని వ్యవసాయశాఖ విత్తన విభాగం ఉపసంచాలకుడు శివప్రసాద్ తెలిపారు.