సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి ‘‘జగనన్న భూమి శాశ్వత హక్కు’’ లేదా ‘‘వైఎస్ఆర్ భూమి శాశ్వత హక్కు’’ అనే పేర్లలో ఒకదాన్ని పెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు సరిహద్దు రాళ్లపై చిహ్నాలను ముద్రించాలని చూస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పేర్నమిట్ట ప్రాంతంలోని ఓ గ్రానైట్ స్టోన్ అర్కిటెక్చర్ యూనిట్ యజమాని వద్దకు ఇటీవల ఒక వ్యక్తి వెళ్లి సీఎం జగన్ ముఖచిత్రం, ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉండేలా సర్వే హద్దు రాళ్ల నమూనాలు కావాలని కోరగా తయారు చేశారు. వాటిని మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి చూపించారు.
ఒక్కో దానికి రూ.4000 ఖర్చవుతుందని చెప్పగా వద్దన్నారని, వాటిని తిరిగి మోసుకురాలేక అక్కడే వేరే కార్యాలయంలో వదిలి వచ్చామని యజమాని తెలిపారు. ఈ విషయమై సర్వే విభాగం ఏడీ కేశవరావును వివరణ కోరగా రెండు రకాల్లో సర్వే రాళ్ల నమూనాలను తయారు చేయించి విజయవాడకు పంపామని అంగీకరించారు. వాటిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని వివరించారు.