ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 29, 2020, 3:23 PM IST

ETV Bharat / city

ఆ మత్స్యకారులకు రూ.2 వేలు ఆర్థిక సాయం: సీఎం

కరోనా నివారణ చర్యలు, ప్రభావిత రంగాల పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్​ సమీక్షించారు. రాష్ట్రంలో కేసుల ఉద్ధృతిపై ఆరా తీశారు. ఇంటింటి సర్వేలో గుర్తించిన అనుమానితులందరికీ కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు.

cm jagan
సీఎం జగన్

కరోనా నివారణ చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వివరించారు.

గుజరాత్‌ నుంచి మత్స్యకారులను తీసుకొస్తున్న అంశంపై సీఎం ఆరా తీశారు. 4,065 మందికిపైగా బస్సుల్లో స్వస్థలాలకు బయల్దేరారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రవాణా, భోజనం, దారి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తోందన్నారు. మత్స్యకారులు వచ్చాక వారికి రూ.2 వేల చొప్పున ఆర్థికసాయం అందించాని సీఎం అధికారులను ఆదేశించారు.

కరోనా కేసులపై...

రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండడంపై సీఎం ఆరా తీశారు. నమోదైన కరోనా కేసులు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. కొత్తగా.. నరసరావుపేట నుంచి 27 కేసులు వచ్చాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అక్కడ పెద్దఎత్తున కంటైన్మెంట్‌ చర్యలు తీసుకున్నామని తెలిపారు. 70 శాతం పరీక్షలు రెడ్‌జోన్లలోనే చేశామన్న అధికారులు... శ్రీకాకుళం రిమ్స్‌ ల్యాబ్‌లో ట్రయల్‌ టెస్టులు ప్రారంభించామని చెప్పారు. ఒంగోలు, నెల్లూరులో ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శనివారం నాటికి 3 ల్యాబ్‌లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు.

సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలు

ఇంటింటి సర్వేలో గుర్తించిన కరోనా అనుమానితులకు చేస్తున్న పరీక్షల వివరాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. సర్వేలో గుర్తించిన వారిలో 12, 247 మందికి పరీక్షలు చేశామని అధికారులు వివరించారు. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు. మూడ్రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు.

పంట నష్టంపై ఆరా

అరటి, టమాటా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. చీనీ పంటకు ధర వచ్చేలా చూడాలన్నారు. గాలివాన వల్ల పంటలు దెబ్బతిన్న చోట్ల ఎన్యుమరేషన్‌ చేయాలన్నారు. ప్రక్రియను‌ త్వరగా పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

'మత్స్యకారులను తరలించేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.3 కోట్లు'

ABOUT THE AUTHOR

...view details