హైదరాబాద్ పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు మొదలైంది. మొహర్రం సంతాప దినంలో భాగంగా డబీర్పురాలోని బీబీ-కా-ఆలం నుంచి అంబారిపై బయలుదేరిన బీబీ-కా-ఆలం ఊరేగింపు.. చార్మినార్ మీదుగా సాగనుంది. భారీ సంఖ్యలో షియా ముస్లిం సోదరులు... కత్తులు, బ్లేడ్లతో తమ శరీరాన్ని గాయపరుచుకుని రక్తాన్ని చిందిస్తూ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
చార్మినార్ వద్ద బీబీ-కా-ఆలం చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. డబీర్పురాలోని బీబీ-కా-ఆలం నుంచి మొదలైన ఊరేగింపు.. అలీజ కోట్ల, చార్మినార్, గుల్జార్హౌజ్, పంజేశా, మీర్ఆలం మండి, దారుల్ శిఫ మీదుగా వెళ్లి చాదర్ఘాట్ వద్ద ముగుస్తుంది.
మరోవైపు ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ చార్మినార్ వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొహర్రం సందర్భంగా.. కరోనా నిబంధనల ఉల్లంఘన జరిగే అవకాశముందని అంజనీ కుమార్ అన్నారు. ప్రజలెవరూ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారులదేనని చెప్పారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పండుగ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
త్యాగం, స్ఫూర్తికి ప్రతీక మొహర్రం..
మొహర్రం పండుగ త్యాగం, స్ఫూర్తికి ప్రతీక అని, మానవ జాతిలో త్యాగం ఎంతో గొప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విశ్వాసం, నమ్మకం కోసం మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవడమే మొహర్రం అని వెల్లడించారు. మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే ఈ వేడుకకు నిజమైన అర్థమని అన్నారు.
ఇస్లాంలో ముఖ్యమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రం స్ఫూర్తిని అనుకరిద్దామన్నారు. త్యాగం, శాంతి, న్యాయం వంటి ఆదర్శాలు మనలో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతాయని సీఎం పేర్కొన్నారు.
స్ఫూర్తిని చాటుతుంది..